బీఆర్ఎస్ పాలనలోనే మా గ్రామం సుభిక్షం!
25 వసంతాల ఆవిర్భావ సభకు ఊరంతా తరలి వెళ్తాం
స్పష్టం చేసిన ఆదిలాబాద్ జిల్లా ముఖరా-కె గ్రామ ప్రజలు
ఓరుగల్లు సభ నిర్వహణ ఖర్చులకు రూ.1,02,003 విరాళం
పంట చేనులో మాజీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఆ గ్రామమంతా ఒక్కటైంది!.. అదే ఆదిలాబాద్ జిల్లా ముఖరా-కె గ్రామ ప్రజలు. బీఆర్ఎస్ పాలనలోనే గ్రామం సుభిక్షంగా ఉండేదని.. 25 ఏళ్ల వసంతాల ఆవిర్భావ సభకు ఊరంతా తరలి వెళ్తామని, ఓరుగల్లులో నిర్వహించే 25 వసంతాల పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ ఖర్చులకు రూ.1,02,003 విరాళంగా ఇస్తున్నామని ముఖరా – కె గ్రామ ప్రజలు ప్రకటించారు. సోమవారం పంట చేనులో సమావేశమై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ పాలనలోనే ముఖరా కె గ్రామం అద్భుతమైన ప్రగతి సాధించి దేశంలోనే ఆన్లైన్ లావాదేవీల్లో ఆదర్శంగా నిలిచిందని మాజీ సర్పంచ్ మీనాక్షి సుభాష్ గాడ్గే తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని , రైతుబంధు రుణమాఫీ అందరికీ అమలు చేయడం వల్లే రైతులు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు.
కేసీఆర్ రుణం తీర్చుకుంటా…
పదేళ్లు కేసీఆర్ మమల్ని అన్నిరంగాల్లో అభివృద్ధి బాటలో నడిపారని, ఇప్పుడు తాము కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ఏప్రిల్ 27 న ఓరుగల్లు లో నిర్వహించే బహిరంగ సభకు విరాళం ప్రకటించామని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులందరు కలిసి రూ. 1,02,003 విరాళాన్ని పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కు అందజేయాలనీ నిర్ణయించినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు లక్షా రెండువేల మూడు రూపాయల చెక్కును వర్కింగ్ ప్రెసిడెంట్ కు అందించాలని గ్రామస్తులు విరాళాన్ని మాజీ సర్పంచ్ మీనాక్షికి అందించారు. ముఖర గ్రామానికి అభివృద్ధి బాటలు వేసిన కేసీఆర్ వెంటే నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. 25 వసంతాల పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం చేసేందుకు ఈనెల 27న అందరం కలిసి వెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.