చికిత్స పొందుతూ మృతి

మంత్రి ఫరూక్ దిగ్భ్రాంతి
(కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ) : నంద్యాల వ్యవసాయ శాఖ ఏడీ (Nandyal Agriculture Department AD)గా పని చేస్తున్న బండారి ఆంజనేయ(58) శుక్రవారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ (Minister NMD Farooq) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతి (Amaravati)లో ఉన్న మంత్రి ఫరూక్ విడుదల చేసిన ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సౌమ్యుడుగా, వివాదరహితుడిగా, వ్యవసాయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆంజనేయ రెండు నెలల క్రితమే బదిలీపై వచ్చి నంద్యాల డివిజన్ ఏడీ(Nandyal Division AD)గా విధులు నిర్వహిస్తున్నారు.
అంతకుముందు ఆయన కర్నూలు జిల్లా (Kurnool District)లో వివిధ హోదాల్లో పని చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం (Vigilance and Enforcement Department)లో చాలాకాలంగా పనిచేశారు. ఆ సమయంలో పలు అవినీతి, అక్రమాల సమస్యలను వెలుగులోకి తేవడంలో ఆంజనేయుని పాత్ర ఎంతో ఉంది. నంద్యాలకు బదిలీ అనంతరం అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయ మృతి చెందడం ఎంతో బాధాకరమని మంత్రి ఫరూక్ సంతాపం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖలో మంచి ఉద్యోగిగా పేరు సంపాదించుకున్న ఆంజనేయ మృతి తో, అతని సేవలు నంద్యాల ప్రాంత రైతులకు దూరం కావడం మనోవేదనకు గురయ్యానని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆంజనేయ కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, ప్రభుత్వ పరంగా ఆంజనేయ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి ఫరూక్ సంతాపం వ్యక్తం చేశారు.
