హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి చెందారు.. ముల్కనూరు-ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై గోపాల్ పూర్ క్రాసింగ్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఓ చర్చి పాస్టర్ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగంగా నుజ్జునుజ్జు అయింది.
గోదావరిఖనికి చెందిన కనకపుడి కరుణాకర్ కరీంనగర్లోని ఓ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున హనుమకొండ నుంచి కరీంనగర్కు తన కారులో బయల్దేరారు. అయితే హుజూరాబాద్ రహదారిలో రోడ్డు పనులు జరుగుతుండటంతో హుస్నాబాద్ నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలో గోపాల్పూర్ క్రాసింగ్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ.. కారును డీ కొట్టింది. దీంతో ఆయన ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అవడంతో కరుణాకర్ అందులోనే ఇరుక్కుపోయారు. లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.
కాగా, రోడ్డుపై వెళ్తున్న ప్రయాణీకులు పోలీసులకు, 108కి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతికష్టంపై మృతదేహాన్ని అందులోనుంచి బయటకు తీశారు. లారీ డ్రైవర్ నిద్ర మత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.