వెలగపూడి : ఏపీ శాసనమండలిలో దిశాచట్టం, దిశా యాప్ పై అధికార… ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఈసందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ… గత (వైసీపీ ప్రభుత్వం హాయాంలో) ఐదు సంవత్సరాల్లో దిశా యాప్ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్ లో ఎక్కించారని.. దిశా చట్టమంటూ… చట్టబద్ధతలేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. దిశా యాప్ ద్వారా ఎన్ని కేసులు నమోదయ్యాయో ఒకసారి లెక్కలు చూసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దిశా పోలీస్ స్టేషన్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. దిశా యాప్ ఇప్పుడు ప్రభుత్వం వాడకపోతే… దాని స్థానంలో కొత్త యాప్ని తీసుకొస్తున్నారా అని వరుదు కళ్యాణి ప్రశ్నించారు.
శక్తి పేరుతో కొత్త యాప్ తెస్తున్నాం ..
దీనికి సమాధానం చెప్పిన అనిత దిశా యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో విపక్ష సభ్యులు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు దిశా చట్టానికి చట్టబద్ధత ఉందా.. లేదా.. అనేది విపక్ష సభ్యులు చెప్పాలన్నారు. లేని చట్టాన్ని తీసుకొచ్చి మేం ఏదో చేశామని గొప్పలు చెప్పుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు.. దిశా యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోంమంత్రి అనిత సభకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్ను ప్రారంభిస్తున్నట్టు హోంమంత్రి తెలిపారు.
