TG | కులగణనపై ముగిసిన కేబినెట్ సబ్కమిటీ… సర్వే వివరాలు తెలిపిన ఉత్తమ్ !
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కులగణన, సామాజిక సర్వేపై నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సర్వేలకు సంబంధించిన నివేదికను ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా క్యాబినెట్ సబ్కమిటీకి సమర్పించారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై కులగణన అంశంపై చర్చించింది.
కులగణనపై మంత్రివర్గ ఉపసంఘం ముగిసిన అనంతరం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో సామాజిక, కుల గణన సర్వే చేపట్టినట్లు తెలిపారు.
దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే జనగణన జరుగుతోందని… నిజానికి అసలైన పేదలను గుర్తించేందుకు కుల గణన జరగలేదని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, కులగణన నిర్వహించాలని అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.
రాష్ట్రంలో చేపట్టిన సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ గణనను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినా.. విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, రాష్ట్రంలో 3.50 కోట్ల మంది సర్వేలో పాల్గొని కులగణన, సామాజిక సర్వేలో వివరాలు అందించారని.. ఇది రాష్ట్ర జనాభాలో 96.9 శాతం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 3.1శాతం మంది.. అంటే 16 లక్షల మంది పలు కారణాల వల్ల వివరాలు అందించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇక కులగణన సర్వే నివేదికను ఈ నెల 4న మంత్రివర్గం ముందుంచుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మంత్రివర్గంలో చర్చించిన వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు.
కులగణన సర్వేలోని ముఖ్యాంశాలు
రాష్ట్ర జనాభాలో 96.90 శాతం మంది కులగణన సర్వేలో పాల్గొన్నారు.
సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతం.
వివరాలు ఇచ్చిన కుటుంబాల సంఖ్య 1,12,15,131
వివరాలు అందించిన వారి 3,54,77,554 సంఖ్య
బీసీల జనాభా 46.25 శాతం
ఎస్సీల జనాభా 17.43 శాతం
ఎస్టీల జనాభా 10.45 శాతం
ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08 శాతం
ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం
ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం
మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం
మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం