Aga Khan | ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ కన్నుమూత
ఢిల్లీ : బిలియనీర్, పద్మవిభూషణ్ గ్రహీత, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ (88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ ఫౌండేషన్ ప్రకటించింది. ఆగాఖాన్ కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలియజేస్తున్నాం. ప్రపంచంలోని వ్యక్తులంతా మతపరమైన భేదాలు లేకుండా ఆయన కోరుకున్నట్లుగా ప్రజల జీవితాన్ని మెరుగు పరిచేందుకు తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని అగాఖాన్ డెవలప్ మెంట్ నెట్వర్క్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన మరణవార్త కింగ్ చార్లెస్ 3కి తీవ్ర మనస్తాపం కలిగించినట్లు తెలుస్తోంది. ఆయనకు కింగ్ చార్లెస్ 3, ఆయన తల్లి దివంగత క్వీన్ ఎలిజబెత్ 2కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
ఆగాఖాన్ స్విట్జర్లాండ్ లో జన్మించారు. 20 ఏళ్ల వయసు 1957లోనే ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశ పారంపర్య ఇమామ్ నియమితులయ్యారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతో పాటు ఆయన అనేక ఇతర వ్యాపారాల్లోనూ రాణించారు. యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో ప్రముఖంగా నిర్వహించే రేసు గుర్రాల్లోనూ ఆయన పాల్గొనేవారు. 1967లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ను స్థాపించారు. ఇది ప్రపంచంలోనే వందలాది ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేసింది. ఆయన సేవలకు గాను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ సత్కరించింది.