సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
ఆపరేషన్ కగార్ వద్దు.. శాంతి చర్చలు ముద్దు అంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతుంటే.. అటు లొంగుబాట్లు, అటు అగ్రనేతల ఏరివేతకు నిరసనగా ఈ నెల 20న భారత్ బంద్కు మావోయిస్టు పార్టీ సన్నద్ధమవుతోంది. ఇంకో వైపు విశాఖ తీరంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ వస్తుండగా.. ఏపీ గ్రే హౌండ్స్ దళం చరిత్ర సృష్టించింది. అల్లూరి సీతారామ రాజు రంపచోడవరం మన్యంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు కీలక మావోయిస్టు నాయకులను మట్టుబెట్టింది. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నేత, ఏవోబీ స్పెషల్ జోన్ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు , అగ్రనేత చలపతి భార్య అరుణ , ఏసీఎం సభ్యురాలు అంజూ మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి అడవులను జల్లెడ పట్టేందుకు గ్రేహౌండ్స్, యాంటి నక్సల్స్ స్పెషల్ (ఏఎన్ఎస్) బలగాలు, సీఆర్పీఎఫ్, సివిల్ పోలీస్ బలగాలు అడవి బాట పట్టాయి.
పాపికొండల అభయారణ్యంలో..
మావోయిస్టులను మట్టుబెట్టడమే ధ్యేయంగా బయలుదేరిన భద్రతా బలగాలు రంపచోడవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పాపికొండల అభయారణ్య అటవీ ప్రాంత పరిధిలోని రంపచోడవరం, దేవిపట్నం, మారేడుమిల్లి మూడు మండలాల సరిహద్దు ప్రాంతాల్లోని అడవుల్లో కూంబింగ్ ప్రారంభించాయి. ఈ తరుణంలోనే ఈ మూడు మండలాల సరిహద్దుల్లోని కొయ్యలగూడెం – అకూరు గ్రామాల సమీపంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడటంతో మావోయిస్టులకు – పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మన్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉండగా ఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నారు.
ముగ్గురూ కీలక నేతలే ..
మృతుల్లో ముగ్గురూ మావోయిస్టు పార్టీ కీలక నేతలే. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా-ఒడిస్సా రాష్ట్రాల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ అలియాస్ బిర్సూ, ఆంధ్రప్రదేష్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెం గ్రామానికి చెందిన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, ఆంధ్రా-ఒడిస్సా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ అలియాస్ అంకిత అలియాస్ రూప్పి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఏసీఎం అంజు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన స్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. గాజర్ల రవి (ఉదయ్) తలపై రూ.25లక్షలు, ఇక జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య. ఆమెపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. వెంకట రవి లక్ష్మి చైతన్య, అలియాస్ అరుణ అలియాస్ రూపీ..అరుణది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరక వాణి పాలెం. తండ్రి లక్ష్మణరావు, తల్లి మావినేత, తమ్ముడు ఆజాద్ కూడా మావోయిస్టు నేతే. పాల సముద్రం ఎన్కౌంటర్ కాల్పుల్లో మృతి చెందారు. సోదరి ఝాన్సీ న్యాయవాది. అరుణ భర్త మావోయిస్టుల అగ్రనేత చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి.మావోయిస్టు పార్టీలో అగ్రనేత. కేంద్ర కమిటీ సభ్యుడు. ఆయనపై ఏకంగా రూ.కోటి రివార్డ్ ఉంది. 2008లో ఒడిశాలో భద్రతా బలగాలపై చేసిన దాడికి ఈయనే ప్రధాన సూత్రదారి. ఈ ఘటనలో 13 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. 2018లో అరకు ఎమ్మెల్యేగా ఉన్న కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో చలపతి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. చంద్రబాబు అలిపిరి ఘటనలో కీలక వ్యక్తి…..తరవాత శ్రీకాకుళం దగ్గరలో కాల్పుల్లో మృతి చెందారు. విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కిలారి సర్వేశ్వర రావు. మరో ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలో కేసుతో అరుణ కీలక నిందితురాలు. 2018లో డుంబ్రిగుడ దగ్గర వీరిద్దరినీ మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది.
మూడు నెల్లో మూడవ ఎన్ కౌంటర్
అల్లూరి సీతారామరాజు జిల్ల్లాలోని మన్యంలో మూడు నెలల వ్యవధిలో పోలీసులకు – మావోయిస్టులకు మధ్య మూడుసార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఏడాది ఏఫ్రిల్ 29 వ తేదిన కోయ్యూరు మండలం మంప పోలీస్స్టేషన్ పరిధిలోని యూచీడిపాలెం పంచాయతీ కాకుల మామిడి, కంఠారం అటవీ ప్రాంతంలో తొలి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి ఆధునిక ఆయుధాలు, భారీగా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల్లోనే వైరామవరం – కోయ్యూరు మండలాల సరిహద్దుల్లోని భీమవరం పంచాయతీలోని మడుక్కోట – కాకుల మామిడి అటవీ ప్రాంతంలో రెండవ సారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కాకురి పండన్న అలియాస్ జగన్, కోరాపుట్ డీసీఎం రమేష్ అనే ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే మన్యంలో మూడోసారి మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఎదురుకాల్పులు జరిగి ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
మన్యంలో అప్రమత్తం
అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ నేపధ్యంలో పోలీసులు అడవులను జల్లేడ పడుతున్నారు. ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్కి నిరసనగా మావోయిస్టులు విధ్వంసకర సంఘటనలకు పాల్పడే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారులు రంపచోడవరం డివిజన్, చింతూరు సబ్ డివిజన్ పోలీసులకు మన్యంలో అప్రమత్తంగా, హైఅలర్ట్గా ఉండాలని ఆదేశాలతో ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు పోలీస్ సబ్ డివిజన్లైన రంపచోడవరం పోలీస్ డివిజన్లోని వైరామవరం, రాజవోమ్మంగి, దుశ్చర్తి, గుర్తేడు, మారేడుమిల్లి పోలీస్స్టేషన్ల పోలీస్ బలగాలు, సీలేరు, జీకే విధీ పోలీస్స్టేషన్ల పోలీస్ బలగాలు, చింతూరు సబ్ డివిజన్ పోలీస్ పరిధిలోని డొంకరాయి, మోతుగూడెం, చింతూరు పోలీస్స్టేషన్ పరిధిలో పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండి ఆయా పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతాల్లో కూబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏజేన్సీ సరిహద్దుల్లో ఏఎన్ఎస్ (యాంటి నక్సల్స్ స్వాడ్ పార్టీ), కోబ్రా బలగాలు, పోలీసు బలగాలు, సీఆర్పీఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సరిహాద్దు గ్రామాలపై పోలీస్ నిఘా ఏర్పాటు చేసి అనుక్షణం సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఏఎస్ఆర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్తో జిల్లా వ్యాప్తంగా పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రా, చత్తీష్గడ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల (ఏసీటీవో) సరిహద్దుల్లో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయి. అడవులను జల్లెడ పడుతున్నాయి.
పెద్ద కొర్మాలో మావోయిస్టుల దుశ్చర్య
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం కొందరు నక్సలైట్లు లొంగిపోయారు. నక్సలైట్ కుటుంబంలోని ముగ్గురిని చంపినట్లు సమాచారం. మరో కొంతమంది గ్రామస్తులను చితకబాది, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ సంఘటన నక్సల్స్ ప్రభావిత పెద్దకోర్మా గ్రామంలో జరిగింది. మంగళవారం (జూన్ 17న) సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య నక్సలైట్లు పెద్ద సంఖ్యలో వచ్చి అరాచకాలకు పాల్పడ్డారు. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సలైట్ దినేష్ మోడియం బంధువులు జింగు మోడియం, సోమ మోడియం, అనిల్ మాద్వి లను మావోయిస్టులు హతమార్చారని సమాచారం. ఈ గ్రామంలోని ఏడుగురు గ్రామస్తులను పిలిచి నిర్దాక్షిణ్యంగా కొట్టినట్లుగా వారి కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామానికి పోలీసు బృందాన్ని పంపి సమాచారం సేకరిస్తున్నట్లు ఏఎస్పీ చంద్రకాంత్ అన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల కుటుంబసభ్యులను హతమార్చిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.