విజయవాడ – గన్నవరం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వల్లభనేని వంశీ బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.. విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. రెండు సార్లు కూడా బెయిల్ తిరస్కరించింది కోర్టు.. దీంతో.. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఆ పిటిషన్పై ఇటీవల ఇరు వర్గాల తరపు న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు.. ఈ రోజు వల్లభనేని వంశీ మోహన్కు బెయిల్ మంజూరు చేసింది.. ఈ కేసులో వల్లభనేని వంశీ తో పాటు మరో నలుగురు నిందితులకు కూడా బెయిల్ ఇచ్చింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం..
అయితే, వల్లభనేని వంశీ మొదట సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయినా.. ఆ తర్వాత ఆయనపై వరుసగా మరిన్ని కేసులు నమోదు అయ్యాయి.. వంశీపై మొత్తం ఆరు కేసులు పెట్టారు.. ఆ ఆరు కేసుల్లో ఐదు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పొందారు వల్లభనేని వంశీ మోహన్.. కానీ, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇంకా వంశీకి బెయిల్ రాలేదు.. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు వంశీ.. దీంతో, ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా.. ఆయన జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉంది.. కాగా, సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్లో వల్లభనేని వంశీ మోహన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే..