TG | స‌మాజానికి ఎక్స్‌రే కుల‌గ‌ణ‌న … మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన రేవంత్ రెడ్డి

దేశానికే ఆద‌ర్శంగా నిలిచాం
రాహుల్ గాంధీ సూచ‌న‌ల‌తో గ‌ణ‌న చేప‌ట్టాం
తెలంగాణ ఒత్తిడికి త‌లొగ్గిన ప్ర‌ధాని మోదీ
కులగణనలో దేశానికి తెలంగాణ ఒక‌ మోడల్
రాష్ట్ర బీజేపీ నేత‌ల్లో అసూయ‌, అసంతృప్తి క‌నిపిస్తోంది
మీడియాతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

భార‌త్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ దేశ ప్రజల గుండెచప్పుడు విన్నార‌ని, కులగణన చేస్తామని హామీ ఇచ్చార‌ని, ఆయ‌న సూచ‌న మేర‌కు తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌న చేప‌ట్టామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్‌లో మీడియాతో గురువారం మాట్లాడారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేస్తున్నామ‌న్నారు. అలాగే అసెంబ్లీలో రెండు తీర్మాననాలు చేసి కేంద్రానికి కూడా పంపించిన‌ట్లు చెప్పారు. జనగణనలో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని తొలగించాలని తీర్మానం పంపామ‌న్నారు.

బీసీల ఒత్తిడికి త‌లొగ్గిన ప్ర‌ధాని మోదీ..

జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టామ‌ని, త‌మ ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కూడా కులగణనపై నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌ని చెప్పారు. జనగణనతో కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని కోరారు. కులగణనకు అనుసరించే విధానాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాల‌న్నారు. ఇందుకు కేంద్ర మంత్రులతో కూడిన కమిటీతో పాటు, అధికారులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేయాల‌ని సూచించారు. తాము కులగణన చేపట్టే క్రమంలో విధి విధానాలు రూపొందించి ప్రజల ముందు పెట్టామ‌న్నారు. తెలంగాణలో మేం 57 ప్రశ్నలతో 8 పేజీలతో కూడిన సమాచారాన్ని సేకరించామ‌ని చెప్పారు. కులగణనలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేశామ‌ని, ఎక్కడా మా పార్టీ కార్యక్రమంలా చేయలేదని, అందరినీ భాగస్వామ్యం చేసి కులగణన పూర్తి చేశామ‌ని చెప్పారు. అందుకే కులగణనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని చెప్పారు. కులగణనలో దేశానికి తెలంగాణ ఒక‌ మోడల్ గా నిలిచింద‌న్నారు.

మాకు ఎలాంటి భేష‌జాలు లేవు

కులగణనపై కేంద్రంతో త‌మ అనుభవాన్ని పంచుకోవడానికి త‌మ‌కు ఎలాంటి భేషజాలు లేవ‌ని, బలహీన వర్గాలకు మేలు జరగాలనేదే త‌మ‌ సంకల్పమ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేసేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా త‌మ‌ ప్రభుత్వం కులగణన చేసించూపించింద‌న్నారు.

బీజేపీ నేత‌ల్లో అసూయ‌, అసంతృప్తి..

త‌మ‌ను విమర్శించే రాష్ట్ర‌ బీజేపీ నేతలను ఒకటే అడుగుతున్నా.. పదేళ్లుగా అధికారంలో ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయలేదు? అని సీఎం రేవంత్ ప్ర‌శ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయ లబ్ది కోసమే త‌మ‌పై విమర్శలు చేస్తున్నార‌న్నార‌ని, స్థానిక‌ బీజేపీ నాయకులలో అసూయ, అసంతృప్తి కనిపిస్తోంద‌న్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారనే బాధ వారిలో కనిపిస్తోంద‌ని, తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్ అన్నారు. మొన్నటి వరకు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిందని, త‌మ‌ ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు ముందుకు వచ్చింద‌ని, బీజేపీ తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరాల్సిన పరిస్థితి ఏర్ప‌డింద‌ని అన్నారు. మ‌హాత్మా గాంధీ శాంతియుత ప‌ద్ధ‌తుల్లో విజ‌యాన్ని సాధించారని, గాంధీ విగ్ర‌హాన్ని హిరోషిమాలో పెట్టుకొని జ‌పానీయులు పూజిస్తున్నార‌ని గుర్తు చేశారు. అదే విధంగా మ‌హాత్ముడు అనుకున్న‌ది సాధించే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌లేదో.. రాహుల్ గాంధీ కూడా అలానే వ‌దిలిపెట్ట‌ర‌ని, ఏదో ఒకరోజు వారు అనుకున్న‌ది అంద‌రూ పాటించాల్సిందేన‌ని సీఎం రేవంత్ అన్నారు.

Leave a Reply