న్యూఢిల్లీ : భారత్లో నివసిస్తున్న పాకిస్థానీ పౌరులను వెనక్కి పంపే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని దేశం విడిచి వెళ్లేందుకు విధించిన ఏప్రిల్ 30 గడువును సవరించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు పంజాబ్లోని అట్టారీ-వాఘా సరిహద్దు గుండా పాకిస్థానీయులు తమ స్వదేశానికి వెళ్లేందుకు అనుమతిని కొనసాగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సరిహద్దు వద్ద చిక్కుకుపోయిన వందలాది మంది పాక్ పౌరులు, వారి కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది.
పహల్గామ్ దాడి తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత్లో ఉన్న పాకిస్థానీ పౌరులు ఏప్రిల్ 30లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని గతంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత సరిహద్దును మూసివేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఆకస్మిక ఆదేశంతో అనేక కుటుంబాలు, ముఖ్యంగా భారతీయులను వివాహం చేసుకున్న పాక్ జాతీయులు, దీర్ఘకాలిక వీసాల కోసం ఎదురుచూస్తున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమను బలవంతంగా వేరు చేస్తున్నారని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు వాపోయారు. భారతీయుడిని వివాహం చేసుకుని, వీసా మార్పు కోసం ఎదురుచూస్తున్న పాక్ జాతీయురాలు సమీరన్, “నా తప్పేంటి? మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు?” అని ప్రశ్నించారు. వైద్య వీసాలు ఉన్నవారికి మొదట్లో మినహాయింపు ఇచ్చినా, ఇతర కేటగిరీలకు చెందిన అనేక మంది ఈ ఆదేశాల వల్ల ఇబ్బంది పడ్డారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం శాఖ గడువును నిలిపివేయడంతో ప్రభావిత కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం లభించింది.
బస్సులో మరణించిన వృద్ధుడు..
ఈ గడువు కారణంగా అట్టారీ సరిహద్దు వద్ద తీవ్ర అనిశ్చితి, భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. 1980 నుంచి భారత్లో నివసిస్తున్న 80ఏళ్ల పాకిస్థానీ పౌరుడు అబ్దుల్ వహీద్ భట్, తనను వెనక్కి పంపే ప్రక్రియ కోసం బస్సులో వేచి చూస్తుండగా మరణించారు. ఈ ఘటన బహిష్కరణ ప్రక్రియ వృద్ధులపై చూపుతున్న శారీరక, మానసిక ప్రభావాన్ని ఎత్తిచూపుతోంది.
సరిహద్దు దాటిన 786 మంది..
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ ను వీడి వెళ్లాలని పాక్ జాతీయులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో బుధవారం నాటికి మొత్తం 786 మంది వెళ్లిపోయారు. వారిలో 55 మంది దౌత్యాధికారులు, వారి డిపెండెంట్లు, సహాయక సిబ్బంది, 8మంది పాకిస్థాన్ వీసాలున్న భారతీయులున్నారు. గడచిన 6 రోజుల్లో వారంతా అటారీ – వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్ కు వెళ్లిపోయారు. పాకిస్థాన్ నుంచి భారత్ కు 1,465 మంది వచ్చారు. వీరిలో 25మంది దౌత్యాధికారులు, అధికారులు, దీర్ఘకాల వీసాలున్న 151 మంది పాకిస్థాన్ జాతీయులున్నారు. ఈ వివరాలను బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియడంతో కేంద్రం ఆదేశాల మేరకు అటారీ- వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. అయితే సరిహద్దులు తెరిచి ఉంచాలని కేంద్రం ఆదేశాల రావడంతో తిరిగి నేటి ఉదయం నుంచి తెరిచారు.. యదావిధిగా ఈ సరిహద్దు నుంచి వీసా గడువు ముగిసిన వారు పాకిస్తాన్ కు వెళ్లవచ్చని పేర్కొంది.