suryapetdistrict| త్వరలో జిల్లాకేంద్రంలో రైల్వే స్టేషన్

suryapetdistrict| త్వరలో జిల్లాకేంద్రంలో రైల్వే స్టేషన్
కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
రూ. 5,330 కోట్లు కేంటాయించిన కేంద్రం
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉన్న సూర్యాపేట జిల్లా పరిధిలోని ప్రజలకు ఇప్పటివరకు రైలు సౌకర్యం లేదు. త్వరలో ఈ కల సాకారం కానుంది. దశాబ్దాల నిరీక్షనకు తెరపడనుంది. కొత్త రైల్వే లైన్ కోసం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డోర్నకల్ నుంచి గద్వాల వరకు 296 కిలోమీటర్ల మేర నిర్మించనున్న కొత్త రైల్వే లైన్కు కేంద్ర రైల్వే శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 5,330 కోట్లు కేటాయించింది. ఇప్పటికే సర్వే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కొత్త లైన్ పూర్తయితే సూర్యాపేట జిల్లా ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పారిశ్రామిక, పర్యాటక రంగాలు భారీగా వృద్ధి చెందనున్నాయి. అలాగే ఈ ప్రాంతంలోని బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, విద్యుదుత్పత్తి కేంద్రాలకు రవాణా సౌలభ్యం లభించనుంది. వ్యవసాయ ఉత్పత్తులను తరలించడం కూడా సులభతరం కానుంది. సూర్యాపేట జిల్లా పరిధిలో మేళ్లచెర్వు, మఠంపల్లి లాంటి స్టేషన్లు ఉన్నప్పటికీ, అవి కేవలం సిమెంట్ పరిశ్రమల సరుకు రవాణాకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఈ కొత్త లైన్ పూర్తయితే ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఈ కొత్త రైల్వే లైన్ మహబూబ్నగర్ మీదుగా సాగే హైదరాబాద్–-బెంగళూరు మార్గాన్ని, వరంగల్ మీదుగా సాగే హైదరాబాద్-–విజయవాడ మార్గాన్ని అనుసంధానిస్తుంది. డోర్నకల్ వద్ద ప్రారంభమయ్యే ఈ లైన్ ఖమ్మం రూరల్, కుసుమంచి, పాలేరు, మోతె మీదుగా సూర్యాపేట చేరుకుంటుంది. అక్కడి నుంచి నల్గొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి, భూత్పూర్ మీదుగా గద్వాల వద్ద ముగుస్తుంది. ఈ మార్గం నల్గొండ వద్ద నడికుడి-గుంటూరు లైన్ను కూడా కలుపుతుంది.

