- కీలక పోరులో ఓడిన ముంబై !
డబ్యూపీఎల్-2025 చివరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో నేరుగా ఫైనల్కు చేరుకోవాలన్న ముంబై ఆశలు ఆవిరాయ్యాయి. ఇప్పటికే నాకౌట్ కు అర్హత సాధించిన ముంబై జట్టు కీలకమైన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ జెయింట్స్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాలి.
మరోవైపు, పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లి క్యాపిటల్స్ నేరుగా ఫైనల్కు అర్హత సాధించింది. 13న ఎలిమినేటర్, 15 తుది పోరు జరుగనుంది.
కాగా, నేటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (53) హాఫ్ సెంచరీతో వీరవిహారం చేసింది. ఇక ఎల్లీస్ పెర్రీ (49 నాటౌట్) మరోసారి మెరిసింది. మెఘన (26) రిచా ఘోష్ (36), జార్జియా వేర్హామ్ (31 నాటౌట్) ఆకట్టుకున్నారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో నాట్ స్కైవర్ బ్రంట్ (69) అద్భుతంగా పోరాడినా తమ జట్టును గెలిపించలేక పోయింది. ఇతర బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. ఆర్సీబీ బౌలర్లలో స్నేహ్ రాణా 3 వికెట్లు పడగొట్టింది. ఎల్లీస్ పెర్రీ, కిమ్ గార్త్ రెండేసి వికెట్లు తీయగా.. హీథర్ గ్రాహం, జార్జియా వేర్హామ్ తలో వికెట్ దక్కించుకున్నారు.