400 Dead Kabul Hospital : మారణహోమం Andhra Prabha News

400 Dead Kabul Hospital : మారణహోమం Andhra Prabha News
- కాబూల్లో ఆసుపత్రిపై బాంబుల వర్షం..
- 400 మంది అక్కడికక్కడే మృతి
- శిథిలాల్లో వందలాది మంది హాహాకారాలు
- ఇప్పటికి 250 మంది క్షతగాత్రులు
- ప్రపంచం షాక్
- ఆఫ్ఘన్-పాక్ ఘర్షణలో భారీ ప్రాణ నష్టం
- తాలిబన్ ఆగ్రహం..
- పాకిస్థాన్ ఖండన.
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
400 Dead Kabul Hospital : ఒక వైపు ఇజ్రో అమెరికా ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీతో పశ్చిమాసియా అల్లాడిపోతుంటే,, ఇప్పటి వరకూ ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య రగలిన యుద్ధ కార్చిచ్చు.. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్యకు చేరింది. సోమవారం రాత్రి ఓ మారణ హోమం ప్రపంచాన్ని కలచి వేసింది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా… తాము ఆసుపత్రిపై దాడి చేయలేదని పాకిస్థాన్ బొంకుతోంది.

ఈ దారుణ మారణ కాండ వివరాలు ఇలా ఉన్నాయి. గత మూడు వారాలుగా ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో కాల్పులు, వైమానిక దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది ఈ స్థితిలో.. 2026 మార్చి 16, , సోమవారం రాత్రి సుమారు 9:00 గంటలకు (IST రాత్రి 10:00 గంటలకు) ఈ దాడి జరిగింది. కాబూల్లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్లోని ఒమర్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్ (Omid Addiction Treatment Hospital) పై ఈ దాడి జరిగింది. ఈ ఆసుపత్రి కాబూల్ లో అతి పెద్దది. సుమారు 2,000 పడకల సామర్థ్యం కలిగిన మాదకద్రవ్య విముక్తి కేంద్రం. ఈ కేంద్రంపై అకస్మాత్తుగా పాకిస్థాన్ వైమానిక దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిలో ఇప్పటి వరకు 400 మంది మరణించారు. మరో 250 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
400 Dead Kabul Hospital : మహా దారుణం

వైమానిక దాడుల కారణంగా ఆసుపత్రిలోని మెజారిటీ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేయడానికి గంటల తరబడి శ్రమించారు.
సహాయక చర్యలు: శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుపోయి ఉండవచ్చని, సహాయక బృందాలు మృతదేహాలను వెలికితీసే పనిలో ఉన్నాయని తాలిబన్ ప్రతినిధులు తెలిపారు. దీనివల్ల మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
400 Dead Kabul Hospital : మిలటరీ స్థావరాలే లక్ష్యం.. పాకిస్థాన్

పాకిస్థాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తాము కేవలం కాబూల్ మరియు నంగర్హర్ ప్రావిన్స్లలోని ఉగ్రవాద శిబిరాలు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకున్నామని, ఏ విధమైన పౌర ఆసుపత్రిపై దాడి చేయలేదని స్పష్టం చేసింది.
