ఉమ్మడి మెదక్ బ్యూరో : గజ్వేల్ సెగ్మెంట్లో 3500 ఇండ్లు నిర్మిస్తామని, రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy) తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని బింగి ఎల్లయ్య గార్డెన్స్ లో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా గజ్వేల్ శాశనసభ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఇందిరమ్మ గృహల 2వ విడుత 2938మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్స్ అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses) ఇస్తామన్నారు. ఇందిరమ్మ హయాంలోనే పేదలకు భూమి పంపిణీ, ఇపుడు కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. పేదలకు ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన (Congress rule) నడుస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గరీబీ హఠావో నినాదంతో పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. వారం పది రోజుల్లో అందరికీ రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామన్నారు.
పేద ప్రజల అభివృద్ధికి సీఎం కంకణం కట్టుకున్నారన్నారు. కోవిడ్ సమయంలో వైద్యం కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. రూ.10లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తున్నామన్నారు. రూ.900 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) ఇచ్చామన్నారు.
జిల్లా కలెక్టర్ కే.హైమవతి మాట్లాడుతూ… సొంతింటిని కలిగి ఉండడం ప్రజలందరికీ కల అన్నారు. ఆ కలను నెరవేరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)కి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఇండ్లను ఆరు నెలల్లో పూర్తిచేసుకుని పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లు గరీమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్, గాజ్వెల్ ఆర్డీఓ చంద్రకళ, హోసింగ్ పీడీ దామోదర్ రావు, గాజ్వెల్ ఏఎంసి చైర్మన్ నరేందర్ రెడ్డి, వంటిమామిడి ఏఎంసి చైర్మన్ విజయ మోహన్, కుకునూరుపల్లి ఏఎంసి చైర్మన్ శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
