34 Passengers Safe: తప్పిన మహా ఘోరం An dhra Prabha News

34 Passengers Safe: తప్పిన మహా ఘోరం An dhra Prabha News
ప్రైవేటు బస్సులో మంటలు
బెజవాడ జనం అప్రమత్తం
షార్ట్ సర్క్యూట్తో మంటలు
డ్రైవరు అలెర్ట్
ఫైర్ సిబ్బంది తక్షణ స్పందన
34 మంది సురక్షితంగా ఇంటికి
( ఆంధ్రప్రభ, విజయవాడ)
34 Passengers Safe: విజయవాడలో ఘోర ప్రమాదం తప్పింది. రోడ్డుపై జనం అప్రమత్తం చేయటంతో.. బస్సు డ్రైవరు చాకచక్యం.. ఫైర్ సిబ్బంది తక్షణ స్పందనతొ 34 మంది ప్రాణాలతో.. సురక్షితంగా.. తమ ఇళ్లకు చేరుకున్నారు. ఏ మాత్రం ఏక గ్రత కోల్పోయినా.. మరో మార్కాపురం దుర్ఘటన జరిగేది. అసలేం జరిగందంటే..
విజయవాడ లోని బస్ స్టాండ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. డ్రైవర్ అప్రమత్తత, ఫైర్ సిబ్బంది తక్షణ స్పందనతో ఘోర ప్రమాదం తప్పి 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రావులపాలెం నుంచి హైదరాబాద్కు బయలుదేరిన సాయి ఆర్కే ట్రావెల్స్ బస్సు విజయవాడ బస్ స్టాండ్ సమీపానికి చేరుకునే సమయంలో వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ కంపార్ట్మెంట్ వద్ద మంటలు రగిలాయి. బస్సు వెనుక మంటలు కనిపించడంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు వెంటనే డ్రైవర్ను అప్రమత్తం చేశారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన డ్రైవర్ చంద్ర వెంటనే వాహనాన్ని ఆపి ప్రయాణికులను హుటాహుటిన కిందకు దింపాడు. ఈలోపే బస్సు మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుపోయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 34 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఘటనపై ఫైర్ శాఖ సిబ్బంది, కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
