25marcheditorial | ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం

25marcheditorial | ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం
25marcheditorial ట్రంప్ ప్రకటన vs ఇరాన్ ఖండన
హార్మూజ్ జలసంధిపై భారత్ కీలక సూచనలు
గల్ఫ్లో చిక్కుకున్న నౌకలు, యుద్ధ వ్యూహం
విరామం మధ్య కొనసాగుతున్న దాడులు
ఇరాన్ పై యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు వైపుల వారు చర్చలు జరుపుతున్నారనీ, అవి ఫలప్రదమైన రీతిలో సాగుతున్నాయని ఆయన ప్రకటించారు. కానీ, అమెరికాతో తమ దేశం చర్చలు జరపడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఫలితంగా కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇటు చర్చలు జరుగుతున్నట్లు అమెరికా చెబుతుండగా ఇజ్రాయెల్ దాడులను ఆపకపోవడం గమనార్హం. మరో వైపు హార్మూజ్ జలసంధి విషయంలో ట్రంప్ తన వైఖరిని మార్చుకోవాలని మన ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు సూచించారు. హర్మూజ్ను తెరచి ఉంచేలా చూడటం అత్యవసరంని ట్రంప్ ఫోన్ చేసినప్పుడు మన ప్రధాని నరేంద్రమోడీ చాలా స్పష్టంగా తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది అని ట్రంప్కి తెలిపారు. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం యావత్ ప్రపంచానికీ అవసరంని కూడా ట్రంపికి మోడీ స్పష్టం చేశారు. సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలనీ, భారత్ శాంతి మార్గమేనని కూడా తెలిపారు.
కాగా, హార్మూజ్ ద్వారా గ్యాస్, చమురు, ఇతర నిత్యావసరాలను తీసుకుని వచ్చేందుకు భారత్ ఎవరి అనుమతినైనా తీసుకుందా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు నౌకాయానం, జలమార్గాల శాఖ కార్యదర్శి ఆర్కె సిన్హా సమాధానమిస్తూ ఈ విషయంలో ఎవరి అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందం కిందికి వస్తుందని ఆయన సమాధానమిచ్చారు. పర్షియన్ గల్ఫ్ లో 500 నౌకలు చిక్కుకుని ఉన్నట్టు, వీటిలో 108 ముడి చమురు ట్యాంకర్లు, 166 చమురు ఉత్పత్తుల ట్యాంకర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ట్యాంకర్లను విడిపించుకోవడం కోసమే ట్రంప్ యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించినట్టు తెలుస్తున్నది.
అయితే, ఈ ట్యాంకర్లలో అమెరికా, దాని మిత్రదేశాలకు చెందినవాటిని విడిచిపెట్టేందుకు ఇరాన్ ససేమిరా అంటున్నది. ఇరువైపులా మళ్ళీ పరిస్థితి మొదటికి రావడానికి అదే కారణమై ఉంటుంది. శత్రుదేశాల నౌకల మినహా మిగిలిన నౌకాలను అనుమతిస్తామని ఇరాన్ చెబుతోంది. ఇజ్రాయెల్పై 78వ విడుత దాడులు ప్రారంభించినట్టు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ తదితర ప్రాంతాలపైనా, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపైనా దాడులు జరిపినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఐదు రోజుల విరామం ప్రకటించినా, ఇరువైపుల వారూ దాడులు జరుపుకోవడం గమనార్హం. కాగా, ఈ యుద్ధంలోకి అమెరికా తరఫున సౌదీ, యూఏఈలు ప్రవేశించనట్టునంటూ కథనాలు వెలువడ్డాయి. అందువల్ల తాత్కాలిక యుద్ధ విరామం కేవలం ప్రకటనలకే పరిమితంమనే భావించాలి.

