క్రికెట్ బెట్టింగ్ కు యువకుడు బలైన ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. బెట్టింగ్లో డబ్బు కోల్పోయిన ఓ యువకుడు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి… మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24ఏళ్ల సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి భారీగా డబ్బును పెట్టుబడి పెట్టాడు. అయితే కొద్ది రోజులుగా జరిగిన మ్యాచ్లలో వరుసగా ఓడిపోవడంతో రూ.2 లక్షలు కోల్పోయాడు. అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురైన అతను, కుటుంబ సభ్యులకు చెప్పకుండా గౌడవెల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమేశ్ మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని క్రికెట్ బెట్టింగ్ ముఠాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువత ఇలాంటి వ్యసనాలకు బానిస కాకుండా, పొదుపు మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్కు యువత దూరంగా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు.