ఎల్లారెడ్డిపేట, ఆంధ్రప్రభ : మరో అవినీతి ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం అనే రైతు భూమి కొలతల ధ్రువీకరణ పత్రం జారీ కోసం సర్వేయర్ ను కలవగా లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు.
మల్లేశం గతంలో రూ.22 వేలు నాగరాజుకు ఇచ్చాడని అధికారులకు తెలియజేశారు. అయినా కూడా పత్రం జారీ చేయకుండా మరికొంత నగదు డిమాండ్ చేయగా శనివారం చంద్రంపేట రైతు వేదిక వద్ద మరో రూ.15వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం నాగరాజును అధికారులు ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు.