Women’s ODI | ట్రైనేష‌న్ సిరీస్ టీమిండియా సొంతం !

భార‌త్ – శ్రీలంక – ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన‌ ముక్కోణపు సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది. ఈరోజు జరిగిన ఫైనల్స్ లో ఆతిథ్య శ్రీలంకతో తలపడిన భారత మహిళా జట్టు అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ పోరులో శ్రీలంకను 97 పరుగుల తేడాతో ఓడించి ట్రై-నేష‌న్ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది.

కాగా, ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు.. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 342 ప‌రుగులు సాధించింది.

భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన ఆతిథ్య శ్రీలంక‌.. 48.2 ఓవ‌ర్ల‌లో 245 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ భారీ ఛేద‌న‌లో శ్రీలంక విష్మి గుణరత్నే (36), నీలక్షిక సిల్వా (48), కెప్టెన్ చామరి అథపత్తు (51) పోరాడారు. హర్షిత సమరవిక్రమ (26), అనుష్క సంజీవని (28), సుగండిక కుమారి (27) స్వ‌ల్ప ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరారు. దాంతో శ్రీలంక కు ఓట‌మి త‌ప్ప‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో స్నేహ్ రాణా 4, అమన్‌జోత్ కౌర్ 3 వికెట్ల‌తో అద‌ర‌గొట్టారు. శ్రీ చరణి ఒక విక‌ట్ ద‌క్కించుకుంది.

అంత‌క‌ముందు, కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రతీకా రావల్ , స్మృతి మంధానలు ఓపెనర్లుగా భారత్ కు గొప్ప ఆరంభాన్నిఅందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే ఇనోకా 15వ ఓవర్లో ప్రతీకా రావల్‌ను పెవిలియన్ కు పంపించింన‌ రణవీర.. ఈ పార్టనర్ షిప్‌ను విడగొట్టింది. ప్రతీకా రావల్ 49 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసింది.

మొదటి వికెట్ పడిపోయిన తర్వాత స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ కలిసి రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించింది. ఈ సమయంలో స్మృతి మంధాన ధ‌నాధ‌న్ ఫోర్లు, సిక్సుల‌తో అర్థసెంచరీ, సెంచరీని పూర్తి చేసింది. 92 బంతుల్లో సెంచరీని పూర్తి చేసిన మంధాన‌.. 101 బంతుల్లో 116 పరుగులు చేసి డుమీ విహంగ బౌలింగ్‌లో హర్షిత మాధవికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది.

ఇక హర్లీన్ డియోల్ (47), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమిమా రోడ్రిగ్స్ (44) రాణించారు. ఆఖ‌ర్లో అమన్‌జోత్ కౌర్ (18) ప‌రుగుల‌తో ప‌రువాలేద‌నిపించ‌గా… దీప్తి శర్మ (20) నాటౌట్ గా నిలిచింది. దీంతో 7 వికెట్ల న‌ష్టానికి టీమిండియా 342 ప‌రుగులు బాదింది. శ్రీలంక బౌల‌ర్ల‌లో మల్కీ మదార, దేవ్మీ విహంగా, సుగండిక కుమారి రెండేసి వికెట్లు తీయ‌గా.. ఇనోకా రణవీర ఒక వికెట్ ప‌డ‌గొట్టింది.

స్మృతి మంధాన ఖాతాలో మరో రికార్డు

మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రీడాకారిణిగా స్మృతి మంధాన నిలిచింది. స్మృతి కంటే ముందు న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్, ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ ఉన్నారు. మెగ్ లానింగ్ 15 సెంచరీలు సాధించగా.. సుజీ బేట్స్ 13 సెంచరీలు సాధించారు.

Leave a Reply