ధారూర్, ఏప్రిల్ 25 (ఆంధ్ర ప్రభ) : పెట్రోల్ పోసి మహిళను దారుణంగా హత్యచేసిన సంఘటన రాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన మ్యతరి బాబు (42) గత కొన్ని రోజుల క్రితం తన భార్యను గొడ్డలితో నరకడంతో తలకు బలమైన గాయమైంది. గ్రామంలో పెద్దల సమక్షంలో గ్రామస్తులు పంచాయతీ పెట్టి నచ్చజెప్పారు. అయినా భార్య బయందోళనకు గురై తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.
వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరికీ వివాహం చేశాడు. అయితే భార్య వెళ్లినప్పటినుంచి దోమ మండలం రాకొండ గ్రామానికి చెందిన వెంకటమ్మ (38) అనే మరొక మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. గురువారం రాత్రి వర్షం కురుస్తోంది. ఎవరూ లేరని తెలుసుకుని వెంకటమ్మ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా అప్పటికే ఆమె నిప్పులో కాలిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి శవాన్ని వెంటనే వికారాబాద్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.