ప్రజలతో, ప్రజల కోసం.. ప్రజల ఆధారణతో…

ప్రజలతో, ప్రజల కోసం.. ప్రజల ఆధారణతో…

  • ప్రపంచ పటంలో బెజవాడ సాంస్కృతిక విప్లవం
  • మైసూరు – కలకత్తా ఉత్సవాలకు దీటుగా నిర్వహణ…

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విజయవాడ ఉత్సవ్ 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ ఉత్సవం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఒక్కటే – ఒకప్పుడు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రాత్మక, పర్యాటక, పత్రిక ప్రింటింగ్, ఆటోమొబైల్ రంగం రాజధానిగా విరాజిల్లిన విజయవాడను మళ్లీ ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెట్టడం. ఈ కాంక్షను సాధించడానికి ఎంపీ కేశినేని శివనాథ్ కేవలం 20 రోజుల వ్యవధిలోనే విజయవాడ ఉత్సవ్ రూపకల్పన చేసి ప్రజల ముందు నిలిపారు. ప్రజల భాగస్వామ్యమే ఈ ఉత్సవం యొక్క నిజమైన బలం.

విజయవాడ ఉత్సవాల కోసం ఘంటసాల సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, గొల్లపూడి ఎక్స్ పో, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అనే ఐదు ప్రఖ్యాత వేదికలను ఎంపిక చేశారు. ప్రతి వేదిక ఒక్కో ప్రత్యేకతను చాటి చెప్పి, నగర వాసులకే కాకుండా భక్తులకు, సందర్శకులకు మధురానుభూతులు కలిగించింది. ఘంటసాల సంగీత కళాశాలలో సంగీత వైభవం ప్రతిధ్వనించింది.తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నృత్యం, నాటకం, నాట్యరూపకాలు ప్రేక్షకులను అలరించాయి. పున్నమి ఘాట్లో ప్రతిరోజూ డ్రోన్ షోలు, క్రాకర్స్ షోలు రాత్రిని పండుగలా మార్చేశాయి. గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కళాకారుల ప్రదర్శనలు, వాణిజ్య ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకర్షించాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భవ్యమైన హెలికాప్టర్ రైడ్స్, మహోత్సవ ప్రారంభం-ముగింపు కార్యక్రమాలు, జాతీయ స్థాయి ఈవెంట్లు జరిగాయి.

విజయవాడ ఉత్సవంలో భాగంగా 11 రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు 280కిపైగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోదభరిత కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. పున్నమి ఘాట్లో ప్రతి రోజు జరిగిన డ్రోన్ షోలు, క్రాకర్స్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుండి నిర్వహించిన హెలికాప్టర్ రైడ్ నగర వాసులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని మిగిల్చింది. కృష్ణమ్మ పరవళ్ళు, విజయవాడ సౌందర్యాలను పై నుండి తిలకించే అదృష్టం వేలాదిమంది ప్రజలకు లభించింది.

దసరా పర్వదినం సందర్భంగా ఉత్సవాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన రోజుల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్లు ఎస్. అబ్దుల్ నజీర్, ఎస్. ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై ఈ ఉత్సవాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు.

విజయవాడ ఉత్సవ్ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్‌ యొక్క దూరదృష్టిని అభినందిస్తూ, ప్రజల ఆకాంక్షల మేరకు ఉత్సవాలను నిర్వహించి విజయవాడ ప్రతిష్టను పెంచారు, భవిష్యత్తులో కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అని హామీ ఇచ్చారు.

విజయవాడ ఉత్సవ్ లో భాగంగా ముగింపు రోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జరిగిన దసరా వేషధారణల కళా కార్నివాల్ ఉత్సవాల వైభవాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా అత్యధికంగా డప్పు కళాకారులు పాల్గొనడం ద్వారా ఈవెంట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. ఇది విజయవాడ ఉత్సవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన గొప్ప ఘట్టంగా నిలిచింది.

ప్రతిరోజూ వేలాదిమంది ప్రజలు తరలి వచ్చి ఉత్సవాలను ఆస్వాదించారు. ఆకాశం మేఘావృతమై వర్షం ఎప్పుడొస్తుందో అన్న అనుమానం ఉన్నప్పటికీ, ఎంపీ కేశినేని శివనాథ్‌ యొక్క బలమైన సంకల్పం, ప్రజల భాగస్వామ్యం, కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఉత్సవాలు ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి. సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం విశేషం.

మైసూరు, కలకత్తా దసరా ఉత్సవాలకు దీటుగా, విజయవాడలో మొదటి ఏడాదిలోనే ఊహలకు అందని విజయాన్ని సాధించిన ఈ మహోత్సవం, జాతీయ – అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి పెట్టింది. మొత్తం మీద, విజయవాడ ఉత్సవ్ 11 రోజులపాటు ఆధ్యాత్మికం, కళలు, వినోదం, చరిత్ర, పర్యాటకం అన్నీ కలగలిసి విజయవాడ ప్రతిష్టను మరింత ఎత్తుకు చేర్చిన మహోత్సవంగా చరిత్రలో నిలిచిపోయింది.

Leave a Reply