అంత్య కాలంలో భగవంతుని స్మరించిన వారు మోక్షమును పొందుతారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పాడు. భాగవతంలో అజామీడోపాఖ్యానంలో అజామీరుడు అపస్మారక స్థితిలో తన చిన్న కుమారుడిని ‘నారాయణ’ అని పిలిచి పరమాత్మ సన్నిదికి చేరాడు. ఈ విదంగా అంత్య కాలంలో భగవంతుని స్మరణ అందరికీ లభించదు. భగవంతుని ధ్యానం అంత్య కాలంలో చేయలేమని, మనం ఎంతకాలం ఉంటామో కూడా తెలియదు కావున ఐదు సంవత్సరాల వయసు నుండి భగవన్నామ స్మరణ చేయాలని భాగవతంలోని ప్రహ్లాద ఉపదేశంలో చెప్పారు. నోరు స్మరించకున్నా, మనసు ధ్యానించకున్నా కనీసం శరీరంలో భగవంతుని సంబంధ స్పర్శ కలిగితే కొంతైనా సుకృతం కలుగవచ్చు అన్న భావనతో ప్రాణం పోయే సమయంలో తులసి తీర్ధాన్ని లేదా గంగా తీర్ధాన్ని పోస్తారు అలాగే చెవిలో భగవన్నామాన్ని చెబుతారు. విన్నా, వినకున్నా, మింగినా, మింగకున్నా, నోటికి తులసి జలం స్పర్శ కొంత పాపాన్ని పోగొడుతుందని విశ్వాసం ఆ ఆచారాన్ని అనుసరింప చేస్తున్నది.
అంత్య కాలంలో తులసీ తీర్ధం ఎందుకు పోస్తారు?
