నరకం మనకే ఎందుకు అని తలచే వారు స్వర్గం మనకెందుకు అని తలవరు. పుణ్యకర్మలు మనము, పాప కర్మలు పరమాత్మ చేస్తారనుకోవడం అవివేకం. నేను కర్తను కాదు, పనితో దానివలన వచ్చే ఫలితంతో తనకు సంబందం లేదు అన్న జ్ఞానం ఉన్నవారు చేయు కర్మ ఏ ఫలితాన్ని మనకు ఇవ్వదు. ఫలితం భావనకే కాని కర్మకు కాదు. మనకు కర్మకు సంబంధం లేదు అనుకున్న వారు, చేసే వాడు, చేయించే వాడు పరమాత్మే అన్న నిశ్చయ జ్ఞానం కలిగిన వారికి స్వర్గ, నరకాలు, పాప, పుణ్యాలతో సంబంధం ఉండదు. ఫలితం కోరి, నేనే చేస్తున్నాను అని కర్మ చేసేవారికి అనుకున్న ఫలితం రాకుండా చేసిన పనిలో పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటుకు ఫలితం అనుభవించాల్సి వస్తుంది. కన్నప్ప నోటి నిండా నీళ్లు తీసుకుని వెళ్లి ఆ జలంతో లింగాభిషేకం చేశాడు. న్యాయంగా ఎంగిలి నీటితో అభిషేకం చేస్తే పాపం. కానీ కన్నప్పకు ఆ భావనే లేదు కావున ఆయనకు శివానుగ్రహం లభించింది. భావనే ప్రధానం కానీ కర్మ కాదు.
సకల కర్మలు పరమాత్మే చేస్తున్నప్పుడు నరకం మనకే ఎందుకు?
