భారీ రద్దీని తట్టుకుంటాం..

  • పటిష్ట ఏర్పాట్లు చేశాం
  • రంగంలో ప్రత్యేక బలగాలు..
  • సీఎం రాకతో అప్రమత్తం అయ్యాం
  • అధికార యంత్రాంగం వెల్లడి

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : జగన్మాత కనక దుర్గమ్మ జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

మూల నక్షత్రం రోజున దర్శన ఏర్పాట్ల పై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో శీనా నాయక్ తో కలసి ఆదివారం మీడియా తో మాట్లాడుతూ.. గడచిన నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పారు.

ఈరోజు లక్షన్నర వరకు భక్తులు రావచ్చని తెలియజేశారు. ఆదివారం రాత్రి 9 గంటల వరకే భక్తులను క్యూ లైన్ లోకి అనుమతిస్తామని చెప్పారు. రాత్రి 11 గంటల తర్వాత క్యూలైన్లో నిలబడే భక్తులు సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారిని రేపు దర్శించుకుంటారని తెలిపారు.

కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగిందని, రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, స్నానానికి నదిలో దిగడం వంటివి చేయవద్దని చెప్పారు.

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ…. ఎన్నడూ లేని విధంగా అమ్మవారి దర్శనానికి భక్తులు విచ్చేస్తున్నారని తెలిపారు. సహజంగా రోజుకు 70 నుంచి 80000 ఉండే భక్తుల సంఖ్య ఇప్పుడు లక్ష దాటిందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం, విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం దీనికి కారణం కావచ్చు అని అన్నారు. 36 కంపార్ట్మెంట్ లన్నీ భక్తులతో నిండినట్లు చెప్పారు. పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో అదనంగా ఏపీ ఎస్పీ ప్లటూన్లను రప్పిస్తున్నామని, రోప్ పార్టీలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.

మొత్తం భక్తులలో విఐపి ల సంఖ్య రెండు శాతం మాత్రమేనని చెప్పారు. సోమవారం విఐపి పాసులు జారీ చేయడం లేదని చెప్పారు. భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా రేపు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్టు చెప్పారు.

దుర్గగుడి ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ.. సోమవారం రెండు లక్షల మంది అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పారు. కుంకుమార్చన, శ్రీ చక్ర నవార్చన వంటి ప్రత్యేక పూజలు చేయించుకునేవారి కోసం భవాని ఘాట్, గాంధీ మ్యూజియం నుంచి వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఉదయం 7 నుంచి 8 మధ్య ఆ వాహనాలలోనే దేవస్థానానికి రావాలని, ఇతర వాహనాలను అనుమతించమని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగున్నర గంటల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. భక్తులకు కోరినన్ని లడ్డూలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Leave a Reply