సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : తనతో పాటు తన తండ్రి కాకా వెంకటస్వామి, కుమారుడు వంశీకి పార్లమెంటు సభ్యుడుగా అవకాశం ఇచ్చిన పెద్దపల్లి ప్రజల రుణం తీర్చుకుంటామని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి (Gaddam Vivek Venkataswamy) తెలియజేశారు. మంత్రి పదవి స్వీకరించిన అనంతరం తొలిసారిగా పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన ఆయన సుల్తానాబాద్ లో కాక వెంకటస్వామి (Kaka Venkataswamy), అంబేద్కర్ (Ambedkar) విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ… తమ కుటుంబంలో ముగ్గురిని ప్రజలు పెద్దపల్లి ఎంపీగా గెలిపించారన్నారు. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకు ఉపయోగిస్తానన్నారు. సింగరేణి (Singareni) నష్టాల్లోకి వెళ్ళినప్పుడు తన తండ్రి కాకా వెంకటస్వామి ఎన్టిపిసి నుండి 400కోట్ల రుణం ఇప్పించి సింగరేణి పురోగమించేలా కృషి చేశారన్నారు. దానివల్ల లక్ష మంది ఉద్యోగాలను కాపాడారన్నారు. మూతపడ్డ రామగుండం (Ramagundam) ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు తనతో పాటు తన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు.