విశాఖపట్నం బ్యూరో, ఏప్రిల్ 14( ఆంధ్రప్రభ ): బాణసంచా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కోట ఊరట్ల మండలం కైలాసపట్నం బాణాసంచా తయారీ కేంద్రంలో నిన్న జరిగిన ప్రమాదంపై ఇవాళ అనకాపల్లి స్థానిక గుండాల కూడలి ఎస్.ఆర్.శంకరణ్ సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కైలాసపట్నం బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిదని, ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించడం జరిగిందన్నారు. సాధారణంగా అగ్నిప్రమాదo జరిగిన ఘటనలో చనిపోయిన వ్యక్తుల మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇస్తాం కానీ మృతుల కుటుంబాలకు రూ.15లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగిందన్నారు.
వీలైనంత త్వరగా మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం అందజేస్తామన్నారు. మృతుల దహన సంస్కార ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. క్షతగాత్రులకు లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిదన్నారు. క్షతగాత్రుల వైద్యపరమైన ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, రాష్ట్ర గవర, గృహ నిర్మాణ కార్పొరేషన్ల చైర్మెన్లు బత్తుల తాతయ్య బాబు, మళ్ల సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.