- ఒడిశా సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ , ఆంధ్రప్రభ : హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న.. తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్కు హాజరవ్వాలని.. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజ్హి ని రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆహ్వనించారు.
శనివారం సాయంత్రం భువనేశ్వర్ సచివాలయం లో సీఎం మోహన్ చరణ్ మాజ్హిని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కలిశారు. మంత్రి శ్రీహరిని సాదరంగ ఆహ్వానించిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజ్హి శాలవాతో ఘనంగా సన్మానించారు.
ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఒడిశా ముఖ్యమంత్రికి మంత్రి శ్రీహరి అందజేశారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్యే లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, భవిష్యత్తు లో అనుసరించే ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు మంత్రి వివరించారు.
నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు.. వివిధ రంగాల నిపుణుల ఆలోచనల మేరకు తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ను గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజ్హి కి వివరించారు.
ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజ్హి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కి ,స్వయంగా ఒడిశా కి వచ్చి తనకు ఆహ్వానపత్రాన్ని అందచేసిన మంత్రి శ్రీహరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఒడిశా ముఖ్యమంత్రి కి రాష్ట్ర మంత్రి శ్రీహరి జ్ఞాపిక ను అందజేశారు.

