Visakha | సాగర తీరంలో మెట్రో త‌రంగం – పనులు వేగవంతం చేసిన ప్రభుత్వం

విశాఖ మెట్రో పనుల వేగవంతానికి కూటమి సర్కార్ చర్యలు
జనరల్ కన్సల్టెన్సీ కోసం ఏఎంఆర్‌సీ బిడ్ల ఆహ్వానం
అక్టోబర్‌లో శంకుస్థాపనకు ప్రభుత్వ సన్నాహాలు
తొలి దశలో 46.23 కి.మీ., 42 స్టేషన్ల నిర్మాణం
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మెరుగైన కనెక్టివిటీపై దృష్టి

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ :

సాగరతీరం విశాఖలో మెట్రో రైలు కూతకు రంగం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఆధునిక రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) ఇటీవల జనరల్ కన్సల్టెన్సీ నియామకం కోసం బిడ్లను ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

తొలిదశలో 46.23 కిలోమీటర్లు..

తొలిదశలో భాగంగా సుమారు ₹11,498 కోట్ల అంచనా వ్యయంతో.. 46.23 కిలోమీటర్ల మేర మూడు ప్రధాన కారిడార్లలో 42 స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించారు.

= కారిడార్ 1: స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు (34.40 కి.మీ., 29 స్టేషన్లు)

= కారిడార్ 2: గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు (5.07 కి.మీ., 6 స్టేషన్లు)

= కారిడార్ 3: తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75 కి.మీ., 7 స్టేషన్లు)

98 ఎకరాల భూమి అవసరం..

మెట్రో తొలిదశ ప్రాజెక్టు కోసం సుమారు 98 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. పలు సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ప్రాజెక్టుకు 100శాతం నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.

భోగాపురం ఎయిర్​పోర్ట్​కు కనెక్టివిటీ..

రాబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో అనుసంధానం కల్పించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, దానికి అనుగుణంగా కనెక్టివిటీని మెరుగుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం వీఎంఆర్‌డీఏ 15కీలక రహదారులను గుర్తించి, వాటి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రత్యేక ఆకర్షణగా డబుల్​ డెక్కర్​ నిర్మాణం..

విశాఖ మెట్రో ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన డబుల్ డెక్కర్ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సుమారు 20.07 కిలోమీటర్ల మేర (మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య) ఈ డబుల్ డెక్కర్ వ్యవస్థను ప్రతిపాదించారు. కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో ట్రాక్ ఉండేలా దీన్ని నిర్మిస్తారు. ఇది పూర్తయితే ఆసియాలోనే అతి పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

ఐటీ కేంద్రంగా మారుతున్న విశాఖ..

విశాఖపట్నం ఆర్థికంగా, పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మెట్రో రైలు ప్రాజెక్టు నగరానికి అత్యంత ఆవశ్యకం. ఐటీ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న విశాఖకు ఈ ప్రాజెక్టు మరింత ఊతమిస్తుందని, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాకుండా, పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖ రూపురేఖలు మారిపోతాయని, నగరవాసుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *