Visakha | యోగాంధ్ర‌కు స‌ర్వం సిద్దం… 22 రికార్డ్ ల కోసం మెగా ఈవెంట్

ముఖ్య అతిధిగా ప్ర‌ధాని మోదీ…
రేపు ఆర్కే బీచ్ లో 3 ల‌క్ష‌ల మందికి పైగా యోగాస‌నాలు
25 వేల మంది ఏక‌కాలంలో సూర్య నమ‌స్కారాలు
ఎపి వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగాస‌నాలు

విశాఖప‌ట్నం – ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ‘యోగాంధ్ర’ (Yogandhara) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రేపు న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International yoga day celebration) పురస్కరించుకుని విశాఖపట్నంలో (visakhapatnam ) ఘనంగా వేడుకలను జరపనున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననుండడంతో దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

విశాఖ వేదికగా భారీ ప్రణాళికలు..

విశాఖలోని ఆర్కే బీచ్‌ (RK beach ) నుంచి భీమిలి వరకు మొత్తం 127 కంపార్ట్‌మెంట్లలో యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారులు భారీ ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో కంపార్ట్‌మెంట్‌ 200×14 మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతుంది. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో వెయ్యిమంది చొప్పున పాల్గొననున్నారు. ప్రతి సెక్షన్‌కు ఒక ఇన్‌చార్జ్, వైద్య సిబ్బంది, పదిమంది వాలంటీర్లు ఉంటారు. ఎల్ఈడీ స్క్రీన్లు, మైకులు, చిన్న స్టేజీలు, సౌండ్ సిస్టమ్‌లతో పూర్తిస్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాల సభ్యులు, నేవీ, కోస్టల్ గార్డు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

22 రికార్డులు లక్ష్యం..

అంతే కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. యోగాంధ్ర సందర్భంగా మొత్తం 22 రికార్డులను సాధించే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు సంబంధించినవి ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025లో భాగంగా మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సూర్య నమస్కార కార్యక్రమం ఉండబోతుంది. రేపు వాతావరణం అనుకూలించక వర్షం పడితే.. ఆర్కే బీచ్ రోడ్డులో కార్యక్రమాలు రద్దు చేసి మొత్తం కార్యక్రమం ఇదే వేదిక వద్ద నిర్వహించే అవకాశం ఉంది.

వాతావరణం అనుకూలంగా ఉంటే ఆర్కే బీచ్ రోడ్డులో గిన్నిస్ రికార్డు పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఏయుకు వచ్చి విద్యార్థుల సూర్య నమస్కారాలను పది నిమిషాల పాటు పరిశీలిస్తారు. ఏజెన్సీ నుండి గిరిజన విద్యార్థులను 106 పాఠశాలల నుంచి 495 బస్సుల్లో విశాఖకు తీసుకువస్తున్నారు. ముందుగా 25 వేల మంది గిరిజన విద్యార్థులతో 1.08 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేయించనున్నారు. .యోగ దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సూర్య నమస్కార కార్యక్రమం నిలవనుంది. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు లక్షల మందితో యోగా డే ఉత్సవాలతో గిన్నిస్ రికార్డును ఏపీ ప్రభుత్వం సాధించనుంది. రాష్ట్ర‌ వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా ఒకేసారి యోగా చేయడం, ఒకే ప్రదేశంలో 3 లక్షల మందితో యోగా చేయడం వంటి రికార్డులపై దృష్టి సారించారు.

రేప‌టి షెడ్యూల్ ఇదే …

జూన్ 21న ఉదయం 6.25కు యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగించనున్నారు. 6.30 నుంచి 6.45కు కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి, ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం ప్రసంగిస్తారు. ఆపై ప్రధాని 15 నిమిషాలు ప్రసంగించనున్నారు. 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి.. 7.45 వరకు నిర్వహిస్తారు. దాంతో యోగాంధ్ర 2025 ముగుస్తుంది.
ప్రధాని మోడీ షెడ్యూల్ ఇదే..

ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి నేటి సాయంత్రం 6:40కి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు ప్రధానికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మళ్లీ శనివారం ఉదయం 6:25కి, రోడ్డు మార్గం ద్వారా ఆర్కే బీచ్‌కి చేరుకుని, 6:30 నుంచి 7:50 వరకు యోగా విన్యాసాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొననున్నారు.

యోగా అనంతరం ప్రధాని ప్రసంగించనుండగా దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మొత్తం 5 లక్షల మంది ప్రజలు యోగా ప్రదర్శనలలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇక ఉదయం 7:50కి మోడీ యోగా కార్యక్రమం ముగించుకొని నేవల్ కమాండ్‌కు తిరిగి చేరుకుంటారు. 8:15 నుంచి 11:15 వరకు పలు రిజర్వ్డ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటారు. అనంతరం 11:25కి INS సర్కార్ పెరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా విమానాశ్రయం చేరుకుని, 11:50కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.

ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబానికి ప్రధాని పరామర్శ

ఇక పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భార్య నాగమణిని ప్రధాని మోదీ కలిసే అవకాశం ఉందని సమాచారం. ఆమె పేరును సైతం అధికారులు ఆహ్వాన జాబితాలో చేర్చారు.

Leave a Reply