తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Union Minister Piyush Goyal) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులు, ఏపీ మంత్రులు అనగాని సత్య ప్రసాద్ (Anagani Satya Prasad), టీజీ భరత్ (T.G. Bharath) లతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, టీటీడీ క్యాలెండర్ స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ… తిరుమల శ్రీవారి దర్శనం (Tirumala Srivari Darshanam) చాలా బాగా జరిగిందని, అద్భుతంగా ఉందని కొనియాడారు. దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశం, సమాజం అభివృద్ధి చెందాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రప్రభుత్వం వేస్తున్న అడుగులు విజయం సాధించాలని, విశ్వగురువుగా భారతదేశం ఎదగాలని స్వామివారిని ప్రార్థించానని పేర్కొన్నారు.