హైదరాబాద్, ఆంధ్రప్రభ : తిరుపతి హతిరామ్ బావాజీ మఠంలో (Hatiram bhavaji matam) తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును (ttd chairman B R Naiidu) తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavita) విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి గురువారం హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఎమ్మెల్సీ కవిత మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 30న హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
త్వరలో బంజరా పీఠాధిపతులతో సమావేశం
త్వరలోనే హతిరామ్ బావాజీ పీఠం నిర్వాహకులు, గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. హతిరామ్ బావాజీ మఠంలో పూజలు చేయడానికి, హారతి ఇవ్వడానికి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 30న హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చారు.