భారత్ దూకుడుకు దిగొచ్చిన ట్రంప్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇన్నిరోజులు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump)టెంపర్ చూపించాడు. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ చివరికి దిగొచ్చాడు. ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరించినా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Indian Prime Minister Narendra Modi) వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ అమెరికాను ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మోదీ దెబ్బకు ట్రంప్ భారత్తో చర్చలకు సిద్ధమే అంటూ తాజాగా తన సోషల్ మీడియా (social media) పోస్టులో కీలక కామెంట్స్ చేశారు.
ట్రంప్ ఏమన్నారంటే..
అందులో భారత ప్రధాని మోదీ గురించి ప్రస్తావించారు. ‘భారత్ – యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(United States of America)లు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురు చూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కచ్చితంగా అనుకుంటున్నాను’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
మోదీ స్పందన ఇదే..
ట్రంప్ పోస్టును ట్యాగ్ చేస్తూ ట్విటర్ (Twitter) వేదికగా మోదీ రిప్లయ్ ఇచ్చారు. ‘భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్. మన మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని భావిస్తున్నా. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా, భారత్ లోని బృందాలు కృషి చేస్తున్నాయి. నేను కూడా ట్రంప్ తో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నా. రెండు దేశాల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం అంటూ మోదీ పేర్కొన్నారు.
