న్యూ ఢిల్లీ – అమరవీరులు భగత్ సింగ్ సుఖ్ దేవ్, రాజ్ గురు. వాళ్ల పేర్లు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది. ఈ ముగ్గురూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భరతమాత కోసం పోరాడిన మహావీరులు. భారతదేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలనే ఆర్పించారు. అలాంటి త్యాగమూర్తులను ఈ రోజు మన దేశం స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వేచ్ఛ, న్యాయం కోసం వారు నిర్భయంగా చేసిన కృషి మనందరికీ స్ఫూర్తి అని ఆయన అన్నారు. ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుంటూ వారికి ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు.
భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు.. ఈ ముగ్గురూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భరతమాత కోసం పోరాడిన మహావీరులు. వీరి పేర్లు వింటేనే భారతీయుల రక్తం దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. అలాంటి దేశభక్తులను ఉరి తీసిన రోజు నేడే. 23 మార్చి, 1931న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఉరితీసింది. 17, డిసెంబర్ 1928న బ్రిటన్ అధికారి శాండర్స్ను హత్య చేయడం, పార్లమెంట్లో బాంబులు వేయడం వంటి కారణాలను చూపి ముగ్గురినీ ఉరితీశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా ఆ రోజును అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్)గా జరుపుకుంటారు.
చంద్రబాబు ఘన నివాళి.
భారతజాతికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించడానికి 23 ఏళ్ల వయసులోనే వీరోచిత పోరాటలు చేసి యువ హృదయాలపై చెరగని ముద్ర వేసిన స్వాతంత్య్ర సమర వీరులు భగత్ సింగ్ , రాజ్ గురు , సుఖ్ దేవ్ లు ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన షహీద్ దివాస్ సందర్భంగా ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుంటూ వారి సంస్మృతికి నివాళులర్పిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.