తిరుపతి – తిరుమల గోశాలలో వందకు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. భూమన వ్యాఖ్యలను ఆయన ఖండిచారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు గోవును తల్లిగా భావిస్తారని ఆనం తెలిపారు. తల్లిలాంటి గోవుల పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిరోజు పరిశీలిస్తున్నారని చెప్పారు. గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని, 230 మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. వయసు పైబడి, అనారోగ్యంతో చనిపోయే ఘటనలను కూడా భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడు జగన్ అని అన్నారు. హిందూ ధర్మాన్ని మీ కుటుంబంలో మీరు పాటిస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఆ వార్తలలో నిజం లేదు – టిటిడి ఛైర్మన్ ..
టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ గోశాలలో ఆవులు పెద్ద సంఖ్యలో మృతి చెందాయంటూ భూమన చెబుతున్న దాంట్లో నిజం లేదని టిటిడి ఛైర్మ న్ బి ఆర్ నాయుడు స్పష్టం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు, కల్పిత ఆరోపణలు చేయడం అత్యంత విషాదకరం అని పేర్కొన్నారు. టీటీడీ ట్రస్ట్ ఎంతో అంకితభావంతో పుణ్య కార్యక్రమాలు చేపడుతుంటే, కంటగింపుతో ఈ తరహా చర్యలకు దిగడం బాధాకరమని బీఆర్ నాయుడు తెలిపారు. గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదని, వేద కాలం నుంచే గోమాతను దేవతలతో సమానంగా పూజిస్తూ వస్తున్నామని వివరించారు.
ఒక్క గోవు చనిపోయినా దానిని మృతిని సాధారణ ఘటనగా భావించలేమని… కానీ అనారోగ్యాలు, వృద్ధాప్యం, ప్రమాదాల వంటి కారణాలతో గోవుల మృతి చెందితే వాటిని రాజకీయంగా అబద్ధపు ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మం అని విమర్శించారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫొటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా చిత్రీకరించడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసగించేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడడం బాధాకరమని, ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించాలని, మోసపోవద్దని సూచించారు. గోసేవ అంటేనే గోదేవి సేవ… ఇంతటి పవిత్రమైన సేవపై రాజకీయ లబ్ధి కోసం బురద చల్లే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలని బీఆర్ నాయుడు పిలుపునిచ్చారు.