మూడో రోజుకి చేరిన ఇజ్రాయెల్ – ఇరాన్ వార్
ఏకంగా 11 అయిల్ క్షేత్రాలను ధ్వంసం చేసిన నెతాన్యాహు సేనలు
ఇజ్రాయెల్ రాజధానిపై క్షిపణులలో దాడి
ఇరువైపుల ప్రాణ , ఆస్తి నష్టం …
నేడు ఇజ్రాయెల్ దాడిలో 60 మంది మృతి
ఇరాన్ క్షిపణులకు నలుగురు హతం
మా జోలికి వస్తే మిగిలేది బూడిదే – ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
హైదరాబాద్ – ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా రెండ్రోజుల క్రితం ఇజ్రాయెల్ (Israel ) ప్రారంభించిన దాడులు మూడోరోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరుదేశాలు పరస్పరం భారీ ఎత్తున క్షిపణులు (Missiles ) , డ్రోన్లతో (Drones ) దాడులు చేసుకుంటున్నాయి. టెహ్రాన్ (Tehran ) నగరం పేలుళ్ల శబ్దాలతో దద్ధరిల్లింది. ఇజ్రాయెల్- ఇరాన్ మూడోరోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. నెతన్యాహు సేనలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. మూడో రోజు ఇరాన్ ఇంధన పరిశ్రమ, రక్షణ కార్యాలయం లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. తాజాగా టెహ్రాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో నలుగురు మృతిచెందారు. 3 రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 80మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది.
అయిల్ జోన్ల పై దాడి

ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు ఫైనాన్షియల్ గా కేంద్రం అయిన సౌత్ పార్స్ పై దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రం కావడం గమనార్హం. ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు చేసిన ప్రకటనలో ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో షహ్రాన్లోని భారీ గ్యాస్ క్షేత్రం ధ్వంసమయినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 11 గ్యాస్ నిల్వ ఉన్న ట్యాంకులు కూడా ఒకదాని తర్వాత ఒక్కోటి పేలిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు సమీప ప్రాంతాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తాజాగా ఇజ్రాయిల్ ఓ అపార్ట్ మెంట్ పై దాడి చేయగా అందులో మొత్తం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 29 మంది పిల్లలున్నట్లు ఇరాన్ పేర్కొంది.
ఇరాన్ క్షిపణులు గలీలి రీజియన్లో ఓ అపార్మెంటును తాకినట్లు ఇజ్రాయెల్ అత్యవసర విభాగం అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో నలుగురు చనిపోయినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలకు ఇంధనం సరఫరా చేసే కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్ మిలిటరీకి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది.
కొత్త క్షిపణితో ఇరాన్ దాడి

ఇజ్రాయెల్పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆదివారం జరిపిన క్షిపణి దాడిలో హజ్ ఖాస్సీం గైడెడ్ బాలిస్టిక్ మిసైల్ను వినియోగించినట్లు పేర్కొంది. ఇరాన్ రక్షణమంత్రి అజిజ్ నసీర్జాదా మే 4న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమవద్ద సరికొత్త బాలిస్టిక్ మిసైల్ సిద్ధమైనట్లు ప్రకటించారు. అది అమెరికా థాడ్, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించగలదన్నారు. ఈ సరికొత్త క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లు అని ఇరాన్ పేర్కొంది. దీని వార్ హెడ్ తన గమనాన్ని మార్చుకోగలదని అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తుందని వెల్లడించింది. దీనికి ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసిం సులేమానీ పేరు పెట్టినట్లు తెలిపింది. అయన చెప్పినట్లుగా ఇజాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ డోమ్ ను చీల్చుకుని ఇజ్రాయెల్ భూభాగంలో పలు ప్రాంతాలలో ఈ క్షిపణులు విధ్వంసం సృష్టించాయి..
దాడులలో అమెరికా హస్తం .
ఈ దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది. న్యూక్లియర్ ఒప్పందాలు చేసుకోవడాన్ని నిరాకరించడం వల్ల తమపై ఇజ్రాయెల్ తో దాడులు సాగిస్తోందని ధ్వజమెత్తింది. అమెరికా సైతం తమ ప్రతీకార దాడులను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇరాన్ తమ ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరించడం పట్ల ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
పశ్చిమాసియాలోన తమ దళాలపై దాడి చేస్తే.. ఇరాన్ ఖేల్ ఖతం – ట్రంప్ వార్నింగ్
తమ దేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా సాయుధ దళాల పూర్తిస్థాయిలో ఇరాన్ పై యుద్ధానికి దిగుతాయని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు . ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్ పై యుద్దానికి దిగుతామని స్పష్టం చేశారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిలో తమ ప్రమేయం లేదని వివరించారు. అమెరికాపై ఇరాన్ దాడికి పాల్పడితే దాని పర్యవసానంగా తీవ్రంగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలను సులభంగా ఖరారు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అంతే గానీ ఈ ఘర్షణల మధ్య తమను లాగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య ఒమన్లో నేడు జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించటం లేదు.