ఎవరెస్ట్ ఒంటరిగా ఎక్కాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే!

  • నేపాల్ కీల‌క నిర్ణయం..

పర్వతారోహణ నిబంధనలలో నేపాల్ కీల‌క‌ సవరణలు చేసింది. ఇక‌పై ఎవరెస్ట్ శిఖరంతో పాటు 8వేల‌ మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న మంచు కొండలను ఒంటరిగా ఎక్కడం నిషేధించింది. పర్వతారోహణలో అనుభవం ఉన్నా.. ఒంటరిగా పర్వతం ఎక్కేందుకు వీలు లేదని నేపాల్ ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. 8వేల మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాల్ని అధిరోహిస్తున్నప్పుడు, పర్వతారోహణ బృందంలోని ప్రతి ఇద్దరు సభ్యులకు కనీసం ఒక గైడ్ ఉండాలని నేపాల్ ప్రభుత్వం పేర్కొంది. ఇతర పర్వతాలను అధిరోహిస్తున్నప్పుడు పర్వతారోహణ బృందంతో కనీసం ఒక గైడ్‌ని ఉండాలని సూచించింది.

ఇక పర్వతాలలో కాలుష్యాన్ని అరికట్టేందుకు… పర్వతారోహకులు తమ వ్యర్థాలను బేస్ క్యాంప్‌లోకి తీసుకురావాలని ప్ర‌భుత్వం పేర్కొంది. పర్వతారోహకులు ఎగువ ప్రాంతాల్లో వ్యర్థాలను సేకరించేందుకు బయోడిగ్రేడబుల్ బ్యాగులను తీసుకెళ్లాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. ఈ ప్రచారం వసంతకాలంలో ప్రారంభమవుతుంది.

విదేశీ పర్వతారోహకులకు రాయల్టీ ఫీజుల పెంపు

మార్చి నుండి మే వరకు (వసంతకాలంలో) సౌత్ పాస్ ద్వారా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించే విదేశీ పర్వతారోహకులకు ప్రభుత్వం రాయల్టీ రుసుమును 11వేల డాల‌ర్ల‌నుంచి 15వేల డాలర్ల‌కు పెంచింది.

సెప్టెంబరు నుండి నవంబర్ వరకు సాగే శరదృతువు సీజన్‌కు క్లైంబింగ్ రాయల్టీని 5,500 డాల‌ర్ల‌ నుండి 7,500 డాల‌ర్ల‌కు పెంచబడింది.

దీనితో పాటు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాల ప్రచారానికి, జూన్ నుండి ఆగస్టు వరకు వర్షాకాల ప్రచారానికి రుసుములను కూడా ప్రస్తుత 2,750డాలర్ల నుండి 3,750డాలర్లకు పెంచారు.

అధికారుల వేతనం పెంపు..

నేపాల్ ప్రభుత్వం లైజన్ ఆఫీసర్లు, హై ఆల్టిట్యూడ్ గైడ్‌లు, బేస్ క్యాంపు సిబ్బందికి అధిరోహకులు చెల్లించే రోజువారీ భత్యాలను పెంచింది.

లైజన్ ఆఫీసర్ల రోజువారీ వేతనం రూ.500 నుంచి రూ.1600కి పెంచారు. సర్దార్లకు ఇప్పుడు రోజుకు రూ.500 నుంచి రూ.1,500 వరకు పెంచారు. హై ఆల్టిట్యూడ్ గైడ్‌ల వేతనం రోజుకు రూ.350 నుంచి రూ.1200కి పెరిగింది. బేస్ క్యాంపు వర్కర్ల దినసరి వేతనం రూ.300 నుంచి రూ.1,000కి పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *