TG | మావోయిస్టులతో మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ : బండి సంజ‌య్

కరీంనగర్, ఆంధ్రప్రభ : మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపే మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా లోని కొత్తపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టుల‌తో మాటల్లేవు… మాట్లాడుకోవడాలు లేవన్నారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవన్నారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు నక్సల్స్ అన్నారు. అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినోళ్లు మావోయిస్టులన్నారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదన్నారు.

కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం..
దేశవ్యాప్తంగా కులగణ‌న‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమ‌న్నారు. దీనిపై కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణనకు పొంతనే ఉండదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది.. బీసీల జనాభాను తగ్గించి చూపారన్నారు.

కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 6 గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోందన్నారు. దొడ్డి దారిన అసత్యపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రూ.4000 పింఛన్ వెంటనే అమలు చేయాలన్నారు. కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అందించాలన్నారు. రైతు భరోసా రూ.15వేలకు పెంచాలి. హామీల అమలు కోసం బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.

పాస్ పోర్టు లేని విదేశీయులను పంపిస్తున్నాం…
పాస్ పోర్టు లేని రోహింగ్యాలను గుర్తించి వెనక్కి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. పాకిస్తానీలు వారి దేశం వెళ్లేందుకు సమయం ఇచ్చామన్నారు.

కాళేశ్వరంపై నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు..
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పిదాలు జరిగాయని నివేదిక వచ్చినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. పరస్పరం సహకారం అందించుకోవడం వారికి అలవాటు. ప్రజల పక్షాన పోరాడేది ఒక్క బీజేపీ మాత్రమేన‌ని బండి సంజ‌య్ అన్నారు.

Leave a Reply