లాభాల్లోకి వస్తున్న ఆర్టీసీ
మరో మైలు రాయి అధిగమించిన మహాలక్ష్మి పథకం
ఉచిత ప్రయాణాలు వినియోగించుకున్న రెండు కోట్ల మంది
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తాము మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పుడు మునిగిపోతున్న పడవ ఎందుకు ఎక్కుతారని ప్రతిపక్షాలు అన్నాయని, మునిగిపోతున్న పడవ కాదు అని ఈ రోజు బదులిచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పండగ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. 200 కోట్ల ఉచిత మహిళా ప్రయాణికులు 6680 కోట్లు ఆదా చేసుకున్నారు వారికి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా మీ చార్జీలను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. వచ్చిన ఆదాయం ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయికి ఆర్టీసీ ఎదిగిందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 2400 కొత్త బస్సులు కొనుగోలు చేసినట్లు చెప్పారు.

ఆక్యుపెన్సీ రేషియో 97 శాతానికి పెరిగింది : మంత్రి పొన్నం ప్రభాకర్
ఒకప్పుడు ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 62 శాతం ఉంటే.. ఇప్పుడు 97 శాతంకి పెరిగిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాలుష్య రహిత హైదరాబాద్గా మార్చడానికి నగరంలో ఉన్న 2800 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ కసరత్తు చేస్తోందన్నారు. ఇప్పుడు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని చెప్పారు. ఇప్పటికే 3000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చారన్నారు. ఇప్పటికే 11 శాతం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయని, దానిని పెంచుకుంటూ పోతున్నామన్నారు. మహాలక్ష్మి పథకం విరివిగా ఉపయోగించి 200 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసుకొని మీరు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్నారన్నారు. నగరాల్లో పనికి ఉపయోగించుకున్నారు, అవసరాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు ,అభివృద్ధి చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నారన్నారు.
