TG | సింగరేణి విస్తరణలో గొప్ప ముందడుగు- రాజస్థాన్ లో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందం

హైదరాబాద్ – సింగరేణి చరిత్రలో మరో గొప్ప వ్యాపార విస్తరణకు నాంది పడింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోని విద్యుత్ సంస్థతో కలిసి సంయుక్తంగా 3100 మెగావాట్ల సోలార్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందడుగు వేసింది.

సోమవారం రాజస్థాన్ లోని జైపూర్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాజస్థాన్ ఇంధన శాఖ మంత్రి హీరాలాల్ నగర్ సమక్షంలో సింగరేణి, రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ అధికారులు ఈ మేరకు కీలక ఒప్పందం చేసుకున్నారు.

ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక ఘట్టమని, త్వరలోనే ఇది కార్యాచరణలోకి వస్తోందని, సింగరేణి వ్యాపార విస్తరణ, సుస్థిర భవిష్యత్ కోసం ఇది ఎంతగానో దోహదం చేస్తుందని భట్టి విక్రమార్కమల్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అపార బొగ్గు నిల్వలతో థర్మల్ విద్యుత్కు నిలయంగా.. రాజస్థాన్ రాష్ట్రం సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా దేశంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయన్నారు. పురోగతి పంథాలో సాగుతున్న ఈ రెండు రాష్ట్రాలు తమ భౌగోళిక పరిస్థితులను అవకాశాలుగా మలచుకోవడానికి పరస్పర సహకారంతో ముందుకు రావడంతో దేశ ఇంధన రంగంలో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టినట్లు అయిందన్నారు.

తెలంగాణ – రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో ఈ ఒప్పందం కీలకంగా మారనుందన్నారు. ఇరు సంస్థలు జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పడి 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను, 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నాయని, పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలకు ఈ ఒప్పందం ఎంతో దోహదపడనున్నదని పేర్కొన్నారు.

ముఖ్యంగా వినియోగదారులకు చవకైనా విద్యుత్ను అందించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ మాట్లాడుతూ ఇప్పటివరకు తమ రాష్ట్ర విద్యుత్తు శాఖ కోల్ ఇండియా అనుబంధ సంస్థలతో మాత్రమే ఇటువంటి ఒప్పందాలు చేసుకొందని, ఇప్పుడు దక్షిణాదిలో ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాక థర్మల్, సోలార్ విద్యుత్ రంగాలలో అనుభవం ఉన్న సింగరేణితో ఒప్పందం కుదరడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు.

సింగరేణికి గల అనుభవం రీత్యా ఒప్పందంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులతో పాటు రానున్న కాలంలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు కూడా సింగరేణితో కలిసి పని చేయడానికి తమ రాష్ట్ర విద్యుత్ శాఖ సానుకూలంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రాజస్థాన్ రాష్ట్ర ఇంధన శాఖ అడిషన్ చీఫ్ సెక్రటరీ అలోక్, తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, సింగరేణి డైరెక్టర్ డి.సత్యనారాయణ రావు పాల్గొన్నారు.

ఒప్పంద వివరాలు ఈ విధంగా ఉన్నాయిఈ ఒప్పందం ప్రకారం 1,600 మెగావాట్ల (2×800మె.వా) థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. మొత్తం పెట్టుబడిలో సింగరేణి సంస్థ 74 శాతం వాటాను, రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ 26 శాతం వాటాను చెల్లించనున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 26 శాతం ధనాన్ని సోలార్, మరియు థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన స్థలాలు, మౌలిక సదుపాయాల రూపంలో కాగా, సింగరేణి తన వాటాగా అంగీకరించిన 74 శాతాన్ని ధన రూపంలో చెల్లించనుంది. ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని అన్ని రకాల అనుమతులతో సింగరేణికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనున్నది.

ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి డిస్కములతో ఒప్పందాలు (పీపీఏ) తదితర అంశాలను రాజస్థాన్ ప్రభుత్వ విద్యుత్ శాఖ వారు చేపట్టనున్నారు. పరస్పర అవగాహనతో లాభదాయకంగా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు.

ఒక్కసారిగా మారిపోనున్న సింగరేణి ముఖచిత్రం సింగరేణి సంస్థ ఇప్పటివరకు కేవలం తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమై తన బొగ్గు ఉత్పత్తి మరియు థర్మల్, సోలార్ రంగాలలో అడుగు పెట్టి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేయగా అదే ప్రదేశంలో మరో 800 మెగా వాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

అలాగే ప్రస్తుతం 245.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థ 2026 నాటికి 450 మెగావాట్లకు పైగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి బొగ్గు సంస్థల్లో నెట్ జీరో కంపెనీగా నిలవాలని ప్రణాళికా బద్ధంగా ముందుకుపోతుంది. వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఒడిశా రాష్ట్రంలోని నైనీ వద్ద ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇది మరో 30 రోజుల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇదే ప్రాంతంలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఇదిలా ఉండగా ఈరోజు రాజస్థాన్ ప్రభుత్వంతో చేసుకుంటున్న 3,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టుల ఒప్పందం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది.రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేక చొరవతో, సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ ఈ ఒప్పందం కోసం గత ఏడాదికాలంగా ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రాజస్థాన్ రాష్ట్రాన్ని సందర్శించి సోలార్ ప్లాంట్లకు అనువైన ప్రదేశాలను అన్వేషించి రావడం జరిగింది. సింగరేణి సంస్థకు పటిష్టమైన ఆర్థిక పునాది మరియు భవిష్యత్తును కల్పించడం కోసం ఈ ఒప్పందం కీలకంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *