TG | కాంగ్రెస్ పాల‌న‌లో జూరాల ప్రాజెక్ట్ కు గ్ర‌హ‌ణం : కెటిఆర్

హైద‌రాబాద్ – సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ చేతకానితనం వల్లే నిన్న జూరాలకు, నేడు మంజీరాకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గత మార్చి 22న స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) నిపుణుల బృందం మంజీరా బ్యారేజీని పరిశీలించి, దాని భద్రతపై ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించిందని కేటీఆర్ గుర్తుచేశారు.

ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. ఆ నివేదికను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. ఊహించని వరద ప్రవాహం కారణంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు వచ్చిన తరహాలోనే, మంజీరా బ్యారేజీపై కూడా వరద ఒత్తిడి పెరిగి పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని, ఆఫ్రాన్ కొట్టుకుపోయిందని, స్పిల్‌వే దెబ్బతిన్నదని ఎస్డీఎస్ఓ నివేదిక స్పష్టంగా హెచ్చరించినా ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడకపోవడం దారుణమని విమర్శించారు.

ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా మేడిగడ్డ మరమ్మతులు చేపట్టకపోవడం, ఇప్పుడు ఎస్డీఎస్ఓ హెచ్చరించినా మంజీరాను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వానికి, దుర్మార్గపు వైఖరికి నిదర్శనమని కేటీఆర్ నిప్పులు చెరిగారు. “మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్ల పగుళ్లపై నానా యాగీ చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు.. ఇప్పుడు మంజీరా పిల్లర్లకు వచ్చిన పగుళ్లపై కనీసం స్పందించకపోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం” అని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులపై కక్ష గట్టి, చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

రానున్న రోజుల్లో ఎగువ నుంచి మంజీరాలోకి వరద ఉద్ధృతి పెరిగితే బ్యారేజీ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి మేడిగడ్డ, మంజీరా బ్యారేజీలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులతో కాలం గడుపుతూ తాగు, సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని కేటీఆర్ హెచ్చరించారు. చివరగా ఆయన ‘జై తెలంగాణ’ అని తన ప్రకటనను ముగించారు.

Leave a Reply