హైదరాబాద్, ఆంధ్రప్రభ : పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాలలో ఒక కొలిక్కి వచ్చిందని, ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాల్లోని మురికి వాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని, నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఈ మేరకు పేదలు నివసిచే చోటనే జి+3 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలివిడతలో హైదరాబాద్లో 16 మురికివాడలను గుర్తించామని. అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు నాలుగు ఐటీడీఏ పరిధిలోగల చెంచు, కొలం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. అలాగే రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ ఇండ్లకు తక్షణమే లబ్దిదారులను గుర్తించి ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.