హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించిన ‘రైతు భరోసా’ను (Raithu bharosa) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ‘రైతు భరోసా’ విజయోత్సవ సభ’లను ప్లాన్ చేస్తోందని, అయితే విజయోత్సవాలు కాదని, రైతులకు క్షమాపణలు (sorry) చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ( BRS ) సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు (MLA Harish Rao) అన్నారు. ఎక్స్వేదికగా ఓ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ‘రైతు భరోసా’ పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు.
19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి రూ.12 వేలకే పరిమితం చేయడం మోసం చేయడమేనని అన్నారు. గత వానకాలం ‘రైతు భరోసా’ ఎగ్గొట్టి, యాసంగిలోనూ ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపడం రైతులను మోసం చేయడమేని ఆక్షేపించారు.
అన్ని పంటలకు బోనస్ అని చెప్పి…అన్ని పంటలకు బోనస్ అని చెప్పి సన్నాలకే పరిమితం చేశారని హరీశ్రావు ఆరోపించారు. రూ.1,200 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినందుకా, ప్రీమియం చెల్లించక రైతు బీమా అమలు ప్రశ్నార్థకం చేస్తున్నందుకా, పంట బీమా అని చెప్పి ఉసురుమనిపించినందుకా.. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా రైతు భరోసా విజయోత్సవాలు అంటూ సెటైర్లు వేశారు. లగచర్ల , రాజోలి రైతుల చేతుల చేతులకు బేడీలు వేసినందుకా. ఏడాదిన్నర పాలనలో ఒక్క చెరువు నింపకుండా, ఒక్క చెక్ డ్యాం కట్టకుండా, కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వనందుకా.. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరపనందుకా అని ఎద్దేవా చేశారు.
మీ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా.. ఎందుకు సంబురాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు.చితికిపోయిన అన్నదాత బతుకులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు చితికిపోతున్నారని, ఇప్పటి వరకు అన్నదాతల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతన్న నేడు ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్పకూలుతున్నాడని తెలిపారు.
తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే.. కాంగ్రెస్ ది రైతు సంక్షోభ ప్రభుత్వమని పేర్కొన్నారు. కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే, మీరు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న కాంగ్రెస్ జిమ్మిక్కులను రైతులు నమ్మరని అన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పాలని.. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.