- ఫ్యూచర్ సిటీ భూసేకరణ వేగవంతం చేయాలి
- పరిశ్రమల శాఖ ప్రణాళికతో ముందుకు సాగాలి
- హైదరాబాద్ను డేటా సెంటర్లకు కేంద్రంగా మార్చడానికి చర్యలు
- ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్
- మెగా ప్రాజెక్టులపై క్రమం తప్పకుండా సమీక్షలు
భారత్ ఫ్యూచర్ సిటీ కోసం భూ సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక వేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లరాదని, ఆ రకమైన ప్రణాళికలతో పరిశ్రమల శాఖ సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖకు సంబంధించిన అంశాలపైన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్గా మారిన పరిస్థితుల్లో కొత్తగా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే సంస్థల డేటా సెంటర్ల ఏర్పాటుకు కావలసిన స్థలం సిద్ధం చేయాలని చెప్పారు.
నిమ్జ్ ప్రాంతంలో మిగిలి ఉన్న భూముల సేకరణ తక్షణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, రైతులతో చర్చించి సామరస్యంగా వ్యవహరించాలని సూచించారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని, దీనికోసం ప్రత్యేక స్పోర్ట్స్ ఆర్కిటెక్ట్ను నియమించాలన్న ఆయన సూచన, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఆయన ఇచ్చే ప్రాధాన్యతను చూపుతుంది. క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్ తదితర ఆటల కోసం అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
ఇంకా, రాష్ట్రంలో ప్రతిపాదిత మెగా ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి 15 రోజులకు మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష జరిపి వాటి అమలుకు వేగం పెంచాలని సూచించారు.
హైదరాబాద్కు గత ఏడాది 70 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు వచ్చాయని, ఈ ఏడాది ఇప్పటివరకు 25 వచ్చాయని, ఈ సంఖ్య మరింత పెరిగేలా ప్రయత్నించాలని చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికార యంత్రాంగం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని కృషి చేయాలని ఆదేశించారు.