కరీంనగర్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో ఆదివారం నాడు ఆయన మీడియ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రూపాయి నాణేనికి బొమ్మా బొరుసు లాంటివి అని అన్నారు.
అందుకే కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా అరెస్ట్ చేయడం లేదు విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు రాజకీయాలు ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే ‘అందరికీ ఇచ్చాం అవకాశం, ఇక బీజేపీకి ఇద్దాం అధికారం అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారన్నారు. కాళేశ్వరం విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం కాళేశ్వరం విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బండి సంజయ్ అన్నారు.
కాళేశ్వరంపై మా స్టాండ్ వెరీ క్లియర్ అని, మోదీ స్టాండే బీజేపీ స్టాండ్ అని అన్నారు. ఊసరవెల్లిలా మాదిరిగా విధానాలు మార్చుకునే పార్టీ బీజేపీ కాదని చెప్పారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నది నగ్న సత్యం అందరికీ తెలుసునని, పదేళ్లు నీతివంతమైన పాలన చేసిన మోదీ ఏ ఆధారాల్లేకుండా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెబుతారా? ఆలోచించండి అని అన్నారు.
కాళేశ్వరం పూర్తి అవినీతిమయమైన ప్రాజెక్టు అని, రూ. 38 వేల కోట్ల ప్రాజెక్టును 1.2 లక్షల కోట్ల అంచనాలు పెంచి కేసీఆర్ దోచుకున్నది ముమ్మాటికీ నిజమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన కొందరు అధికారులు వందల కోట్లు సంపాదించారంటే ఎంత అవినీతి జరిగిందో ఆలోచించాలని అన్నారు. అధికారులనే బలి చేసి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడతామంటే ఎట్లా? అని ప్రశ్నించారు.
ఎన్డీఎస్పైనే బుదర చల్లుతారా?
ఎన్డీఎస్ స్వతంత్ర సంస్థ అని, ఆ సంస్థపై బురద చల్లుతారా? అని బండి ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ రాజ్యాంగ బద్ద సంస్థ…కేసీఆర్ లా ఏది పడితే అది రాసే సంస్థ కాదు అని అన్నారు. కేసీఆర్ కుటుంబం కంటే తోపు ఎవరూ లేరన్నట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్ తనకు తానే పెద్ద ఇంజనీర్…పెద్ద డాక్టర్ అని పదేపదే చెప్పుకున్నాడు కదా అన్నారు. తుపాకీ రాముడి టోపీ తీయలే… చేతిలో కట్టె తీయకుండా డ్రామాలాడుతున్నారన్నారు.
కేసీఆర్ పాలనలో మంత్రులకు విలువందా?
కేసీఆర్ కు తలూపడం తప్ప మంత్రులు అసలు మాట్లాడే సాహసం కూడా చేయలేదు కదా? కాళేశ్వరంసహా అన్ని నిర్ణయాలు కేసీఆర్ ఒక్కడే సొంతంగా తీసుకున్నాడన్నది నిజమని అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని రాహుల్ గాంధీ చెప్పిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు.
కేబినెట్ ఆమోదం, సబ్ కమిటీ సిఫారుసులతో కాళేశ్వరం కట్టారని బీఆర్ఎస్ చెబుతుంటే… ఆ ఆధారాలు ఎందుకు బయటపెట్డడం లేదు? అన్నారు. కాళేశ్వరం వల్ల వచ్చిన లాభమేంది? లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు సాగాలన్నదే బీజేపీ అభిమతమన్నారు.