కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ యాక్ట్ 2025 ను వెంటనే ఉపసంహారించుకోవాలి

కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ యాక్ట్ 2025 ను వెంటనే ఉపసంహారించుకోవాలి
–విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజమల్లయ్య
లక్షేట్టిపేట, ఆంద్రప్రభ : కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ యాక్ట్ 2025 ని వెంటనే ఉపసంహారించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షులు నేరెళ్ల రాజ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పని మధుసూదన్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాలిడేషన్ యాక్ట్ 2025 విశ్రాంత ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఈ చట్టం వలన 2026, జనవరికి ముందు రిటైర్ అయినా వారికి పెన్షన్ లో ఎలాంటి పెరుగుదల ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026, జనవరి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారికి మాత్రమే పీ ఆర్ సీ, డీ ఆర్ లతో పాటు ఇతర బెనిఫిట్స్ వర్తిస్తాయనడం అన్యాయమన్నారు.
ఈ చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ -14 కు పూర్తి వ్యతిరేకమని తెలిపారు.చట్టం ముందు అందరూ సమానులే అని స్పష్టంగా ఉన్నప్పటికీ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెరుగుదల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి శోచనీయమన్నారు. 1979 లో రిటైర్డ్ ఎంప్లాయిస్ పెన్షన్స్ పెరుగుదలకు వ్యతిరేకంగా వచ్చిన ఆదేశాలపై డీ ఎస్ నాకర ఆధ్వర్యంలో భారత అత్యున్నత న్యాయస్థానంను ఆశ్రయించగా, అప్పటి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తో కూడిన 5 గురు సభ్యుల బెంచ్ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు పెన్షన్స్ లో ఎలాంటి వివక్షత చూపరాదని, చట్టం ముందు అందరూ సమానం కాబట్టి పెన్షనర్స్ కు కాలనుగుణంగా పెరుగుదల ఉండాలని తీర్పునిచ్చిందన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ సేవలకు చెల్లించే మూల్యంపైన కేంద్ర ప్రభుత్వం వివక్షతను విడనాడాలని వెంటనే వాలిడేషన్ యాక్ట్ 2025 ను ఉపసంహారించాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్ అనేది ఎవరి దయ,దాక్షిణ్యల మీద ఇచ్చేది కాదని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైన తమ వైఖరి మార్చుకుని పెన్షనర్స్ కు న్యాయం చేయాలని కోరారు.
లేనిచో రాష్ట్ర కమిటీ ఆదేశాలతో మరిన్ని నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఎన్నో ఏండ్లు ప్రభుత్వానికి అనేక రకాలుగా సేవలు అందిస్తే, ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయిస్ కు అన్యాయం చేయడం కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. అంతకుముందు తహసీల్దార్ దిలీప్ కుమార్ కు పెన్షనర్స్ సమస్య పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షులు నేరెళ్ల రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పని మధుసూదన్, కోశాధికారి రాచర్ల సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు జంగం ఆశయ్య, ఉపాధ్యక్షులు దేవేంద్ర విజయుడు, అమీర్ సుల్తాన, జాయింట్ సెక్రటరీ కొట్టె రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నం సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి కొండపర్తి సత్యనారాయణ,సభ్యులు సత్యనారాయణ,పెట్టెం మల్లయ్య, గడ్డం లింగయ్య, కోడి సంపూర్ణ, నూతి శంకరయ్య, మేడి బాలరాజు,వొజ్జల మనోహర్,ప్రతాప్,వేల్పుల లింగం ( సాగర్ ) తదితరులు పాల్గొన్నారు.
