హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఆకాంక్షను ప్రపంచానికి చాటిన కీలక ఘట్టమైన మిలియన్ మార్చ్ 2011 మార్చి 11న జరిగింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఎన్నో లక్షల మంది వచ్చి జై తెలంగాణ నినాదించారు. ఈ ఘట్టానికి సరిగ్గా 14 ఏళ్లు పూర్తయింది. అప్పటి కాంగ్రెస్ పాలకుల ఆంక్షలకు తట్టుకొని.. నిర్భంధాలకు ఎదురొడ్డి.. అరెస్టులను ఎదురించి.. లక్షలాది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ట్యాంక్ బండ్పై గర్జించిన అపురూప సన్నివేశాలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతున్నాయి.
మిలియన్ మార్చ్తో ఉవ్వెత్తున ఎగిసిపడిన జనం
మిలియన్ మార్చ్ తో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జనాలు ఎగిసి పడ్డారు. పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టుకుని లక్షలాదిగా జనం తరలివచ్చారని ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ ప్రస్థానంలో అదో కీలక ఘట్టం. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం అని పలువురు పేర్కొన్నారు. నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసి జలమార్గం గుండా టాంక్ బండ్ చేరుకొని, మిలియన్ మార్చ్ లో పాల్గొన్నారు.