తిరుపతి, : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈనెల 29న హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ముక్కంటి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద పండితులు శ్రీకాంత్కు ప్రైవేటుగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. . ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఫ్యామిలీకి శ్రీకాళహస్తి అర్చకుడు ప్రత్యేకంగా పూజలు చేసిన అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడం దేవస్థానం ఈవో బాపిరెడ్డి వెంటనే స్పందించారు.
ప్రత్యేక పూజలు చేసిన అర్చకుడికి మెమో ఇచ్చారు. శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తించినందుకు ఆలయంలో విధులు నిర్వహించిన వేద పండితులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/1987 ఉద్యోగి నియమ నిబంధనలు అతిక్రమించినందుకు అర్చకుడిని ఈవో బాపిరెడ్డి విధుల నుంచి తొలగించారు.