రైతుల ఆందోళన

రైతుల ఆందోళన
మోత్కూర్, ఆంధ్రప్రభ : కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోవడంతో మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మార్కెట్ యార్డులో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఈ నెల 13 న ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ఎడతెరిపి లేని వర్షాలతో ధాన్యం కాస్త మొలకెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భుజిలాపురం గ్రామానికి చెందిన రైతు మడూరి యాదిరెడ్డి 18 రోజుల క్రితమే ధాన్యాన్ని మార్కెట్ కి తరలించారు.

నిత్యం కురుస్తున్న వర్షాలకు తేమ శాతం తగ్గకపోవడంతో కొనుగోళ్లు చేపట్టడం లేదు. తుఫాన్, భారీ వర్షం రావడంతో ధాన్యం రాశులపై టార్పాలిన్ కప్పినప్పటికీ అడుగు నుండి వరద నీరు వెళ్లడంతో 10 శాతం ధాన్యం మొలకెత్తిందని, మరో 2 రోజులు వర్షాలు కురిస్తే ధాన్యం మరింత మొలకెత్తుతుందని,తక్షణమే అధికారులు కొనుగోలు కోరుతున్నారు. ఇప్పటికే కోతకు వచ్చిన వరి పైర్లు నేలకొరిగి నీటమునిగాయని, ప్రభుత్వం ఎకరాకు రూ.35 వేలు నష్టపరిహారం అందించి పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
