(ఆంధ్రప్రభ, విజయవాడ) : సామాజిక సంస్కర్త, విద్యావేత్త, న్యాయవేత్త భీంరావ్ రాంజీ (డా.బాబా సాహేబ్ అంబేద్కర్) సమానత్వం, స్వేచ్చ, న్యాయం ప్రాతిపదికన రూపొందించిన రాజ్యాంగం నేడు ప్రజాస్వామం పరిఢవిల్లడానికి దోహదపడిందని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా ప్రజల జీవితాలలో వెలుగులు నింపడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగు పడుతున్నాయని రాష్ట్ర ఆర్యోగ వైద్య విద్య, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ఆర్యోగ, వైద్య, విద్య, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్య కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశతో కలిసి సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల డా.బి.ఆర్.అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… జాతి గర్వించదగ్గ మహనీయుడు డా.బాబా సాహేబ్ అంబేద్కర్ నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. ప్రభుత్వాలు అందిసున్న పాలన, పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు డా. బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన విలువలు, సూత్రాలు ముఖ్య కారణమయ్యాయన్నారు. సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకొని అంబేద్కర్ రాజ్యాంగ రచన చేయడం జరిగిందన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మనది భిన్నమైన రాజ్యాంగమన్నారు. బడుగు, బలహీన, పేద, నిరుపేద వర్గాల ఉన్నతికి వీలు కలిగేలాగా ఎంతో విపులంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గొప్ప సామాజికవేత్తే కాకుండా ఆర్థికవేత్తగా, న్యాయనిపుణుడిగా దేశానికి విశిష్ట సేవలందించారన్నారు. మహిళల హక్కులు, సాధికారిత, విద్యపై ఆయనకు ఉన్న అవగాహన ఎంతో కీలకమన్నారు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం, ఆ సమాజం తప్పక అభివృద్ధి సాధిస్తుందన్న అంబేద్కర్ ఆశయాలు మనం భవిష్యత్తు తరాలకు అందించాల్సి ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను భావితరాలు గుర్తించుకునేలా పంచ తీర్థాల పేరుతో ఐదు ప్రత్యేక స్మృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 102వ రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా వెనుకబడిన వర్గాలకు, 104వ చట్ట సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, 105వ చట్ట సవరణ ద్వారా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సమాజంలో జీరో పావర్టీని సాధించడానికి కృషి చేస్తోందన్నారు. ప్రజల్లో దాన స్ఫూర్తిని వినియోగించుకుని ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్, పీపుల్స్ భాగస్వామ్యంతో పి4 విధానం ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో పేదరికాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. స్వయం కృషితో, స్వీయ ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదిగారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, ఆయా వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంబేద్కర్ రచనలను భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేలాగా వాటిని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గొప్ప సంస్కర్త, న్యాయకోవిదుడు, ఆర్ధికవేత్త, గొప్ప జర్నలిస్ట్ గా డా.బి.ఆర్. అంబేద్కర్ రచనలు చదవడానికి మన జీవితకాలం సరిపోదన్నారు. అంబేద్కర్ ఆశయాల నుంచి స్పూర్తిగా తీసుకుంటే ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలుగుతామని డా.లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. బి.ఆర్.అంబేద్కర్ పౌండేషన్ అభ్యక్షులు డా.జగదీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, దళిత నాయుకులు జి.కిశోర్ కుమార్, యం. క్రాంతి కుమార్, ఎన్.బాలజీ, బి. దేవదాస్, సాంఫీుక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.