హైదరాబాద్ – పటాన్చెరులోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం తెల్లవారు జామున 9 గంటల ప్రాంతంలో భారీ పేలుడు ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ ఎక్స్ వేదికగా స్పందించారు. “పటాన్చెరులోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం లో జరిగిన రియాక్టర్ పేలుడు అత్యంత విషాదకరం. ప్రమాద స్థలంలో చిక్కుకున్న కార్మికులను వెంటనే రక్షించాలని అధికారులను కోరుతున్నాను. దయచేసి గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సహాయం అందేలా చూసుకోండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని అన్నారు. అలాగే అన్ని పారిశ్రామిక యూనిట్లకు భద్రతా ఆడిట్లు తప్పనిసరి చేయాలని, ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కవిత సంతాపం
ఈ ఘోర సంఘటనపై మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ” సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సీగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి 10 మంది చనిపోయినట్టు వస్తున్న వార్తలు కలచివేశాయి. రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలి. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ప్రమాదఘటన దురదృష్టకరం – ఎంపి రఘనందన్ రావు
సిగాచి పరిశ్రలో సంభవించిన రియాక్టర్ పేలుడు ఘటన టన చాలా దురదృష్టకరం అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.. ఈ ప్రభుత్వం తనిఖీలు పెంచకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆ తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీలను నియామకాలను చేపట్టి వారితో పరిశ్రమల్లో సేప్టీ తనిఖీలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలలో కార్మికులకు ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పటాన్ చెరు, పాశమైలారంలోని పరిశ్రమల వల్ల చిన్నారులు, గర్భిణిలు, ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీటిని జనావాసాలకు దూరంగా తరలించాలని ఈ తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా కెమికల్ జోన్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను చాలా సార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.. మాజీ మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగి కార్మికులు అందులో చిక్కుకోవడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కార్మికులు, సిబ్బందిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా కోరారు.